అన్నాచెల్లెళ్ల మీద పడిన పిడుగు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిక్కొలు జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కొత్తూరు మండలం ఓండ్రుజోల గ్రామంలో ఇద్దరు చిన్నారులు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిక్కొలు జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కొత్తూరు మండలం ఓండ్రుజోల గ్రామంలో ఇద్దరు చిన్నారులు పిడుగుపాటుకు గురయ్యారు. ఇంటిబయట ఆడుకుంటున్న అన్నాచెల్లెళ్లపై పిడుగు పడగా.. 11 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి చెల్లెలు స్వల్ప గాయాలతో బయటపడింది. చిన్నారులిద్దరూ సాయంత్రం వేళ ఇంటి బయట ఆడుకుంటుండగా ఉన్నట్టుండి వాన మొదలైంది. వారు బయటకు వెళ్లిన కాసేపటికే పెద్ద శబ్దంతో పిడుగు పడింది. ఈ ధాటికి బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా… అతడి చెల్లెలు కూడా స్పృహ కోల్పోయి పక్కనే చెత్త కాలుస్తున్న అగ్గిమంటలో పడటంతో పలు చోట్ల గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు హుటాహుటిన పిల్లలను కొత్తూరు సీహెచ్సీకి తరలించారు. అప్పటికే బాలుడు చనిపోయినట్లుగా వైద్యులు ధృవీకరించారు. చిన్నారికి సీహెచ్సీలో వైద్యం అందించారు. కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిరించారు. వారి రోదనను ఆపడం ఎవరి తరం కాలేదు. ఈ సంఘటనతో ఓండ్రుజోలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.




