సూపర్ స్పైడర్స్ః ఏపీలో ఆ 40 మంది వల్లే వైరస్ వ్యాప్తి
ఈ 40 మంది నుంచి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ వివరాలు సేకరించి గుర్తించిన వైద్య ఆరోగ్య శాఖ ‘సూపర్ స్ప్రెడర్’గా పేర్కొంటోంది.
ఆంధ్రప్రదేశ్ను కరోనా వైరస్ వణికిస్తోంది. చాపకింద నీరులా వ్యాపిస్తూ బీభత్సం చేస్తుంది. రాష్ట్రంలో వ్యాప్తికి కారణమైన మూలాలను గుర్తించే క్రమంలో అధికారులు 40 మంది సూపర్ స్పైడర్స్ ని గుర్తించారు. వారి నుంచే వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగినట్టు తేల్చారు.
రాష్ట్రంలో 40 మంది సూపర్ స్పైడర్స్ ద్వారానే సుమారు 300 మందికిపైగా వైరస్ సోకినట్లు ప్రభుత్వం తేల్చింది. ఈ 40 మంది నుంచి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ వివరాలు సేకరించి గుర్తించిన వైద్య ఆరోగ్య శాఖ ‘సూపర్ స్ప్రెడర్’గా పేర్కొంటోంది. కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి నుంచి ఏకంగా 32 మందికి వైరస్ సోకగా.. ఒకరి నుంచి ఇంత మందికి వైరస్ సోకడం ఆంధ్రప్రదేశ్లో ఇదే ప్రథమం. కృష్ణా జిల్లాలో ఒకరి నుంచి 18 మందికి కరోనా వచ్చింది. గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి ద్వారా 17 మందికి వైరస్ సోకింది. ఈ జిల్లాలోనే ఒక్కొక్కరు 15 నుంచి ఐదుగురు వంతున వైరస్ బారిన పడేందుకు కారణమయ్యారు.
అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాలోనూ ఒక్కొక్క వ్యక్తి నుంచి 12 మందికి వైరస్ సోకగా.. ప్రకాశం జిల్లాలో ఇద్దరు వ్యక్తుల నుంచి పది మందికి వైరస్ వచ్చినట్లు తేలింది. ఇటువంటి సంఘటనలే మరికొన్ని ఇతర జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. కాగా.. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్లో 80 శాతం మందిలో వైరస్ అనుమానిత లక్షణాలు కనిపించలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేలకు చేరువలో ఉంది. వైరస్ బారిన పడి ఇప్పటికే 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 1,980కి చేరింది.