Tirumala: ప్రతీ రోజూ వెయ్యి మందికి తిరుమల శ్రీవారి దర్శనం ఫ్రీ.. ఉచితంగా రూ.50 లడ్డూ కూడా..
తిరుమల శ్రీవారి దర్శనాలపై టీటీడీ మరో ప్రకటన చేసింది. దివ్యాంగులు, వయోవృద్దులకు ఉచిత దర్శనాలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ప్రతీ రోజు వెయ్యి మందికి ఈ ప్రత్యేక దర్శనం ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా వీరికి ఉచితంగా ఒక లడ్డూ కూడా అందిస్తున్నట్లు స్పష్టం చేసింది.

తిరుమల శ్రీవారి దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన జారీ చేసింది. ప్రతీ రోజూ వెయ్యి మంది వయోవృద్దులు, దివ్యాంగులకు ఉచిత దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం మూడు నెలలు ముందుగానే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం ప్రశాంతంగా చేసుకోవచ్చంది. అంతేకాకుండా ఈ టికెట్ పొందినవారికి ఉచితంగా రూ.50 లడ్డూ కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. తిరుమలలోని నంబి ఆలయం వద్ద సీనియర్ సిటిజన్ల ప్రత్యేక దర్శనం క్యూలైన్ ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు దర్శనానికి అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. సీనియర్ సిటిజన్ల దర్శనానికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించింది. దళారుల మాటలు విని భక్తులు మోసపోవద్దని పేర్కొంది.
ఈ నెంబర్కు కాల్ చేయండి
ఇటీవల కొంతమంది దళారులు శ్రీవారి దర్శనం, వసతి గదుల పేరుతో భక్తులను మోసగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. భక్తులు కొంతమంది వీరి మాయ మాటలను నమ్మి మోసపోతున్నారు. దీంతో ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. ఎవరైనా దర్శనం, వసతి గదుల టికెట్లను ఇప్పిస్తామని సంప్రదిస్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచించింది. టీటీడీ హెల్ప్లైన్ నెంబర్ 155257కు కాల్ చేయాలని భక్తులను కోరింది. మధ్యవర్తులు, దళారుల మాటలు విని డబ్బులు పొగోట్టుకోవద్దని, ఇలాంటివారు పట్టుబడితే కఠిన చర్యలు తీసుుకుంటామని హెచ్చరించింది. దళారులపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. అలాగే వయోవృద్దుల దర్శనానికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, వాటికి భక్తులు పట్టించుకోవద్దని తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని పేర్కొంది. భక్తులు సరైన సమాచారం కోసం టీటీడీ అధికారిక వెబ్సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.inను మాత్రమే సంప్రదించాలని సూచించింది. మధ్యవర్తుల, దళారుల మాట నమ్మి మోసపోవద్దని భక్తుల్ని కోరారు.
ఆన్లైన్లో టికెట్లు
కాగా దివ్యాంగులు, 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు, పిల్లలకు టీటీడీ ప్రత్యేక దర్శనం అవకాశం కల్పిస్తోంది. ప్రత్యేక క్యూలైన్ల ద్వారా వీరిని దర్శనానికి అనుమతిస్తోంది. ప్రతీ నెలా ఈ కోటాకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తోంది. భక్తులకు మూడు నెలలు ముందుగానే బుక్ చేసుకుని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. తిరుమలలో కొంతమంది దళారులు ఈ టికెట్లను ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్నారు. స్వామివారి దర్శనం త్వరగా చేసుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది వీరి మాటలను నమ్మి మోసపోతున్నారు. తమ వద్ద ఉన్న డబ్బులను కూడా కోల్పోతున్నారు.
