AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం మనుషులురా..? వైద్యం కోసం వచ్చిన రోగిని వదలకుండా.. చేతివాటం చూపించారుగా!

దొంగలకు కనీసం మానవత్వం, జాలి అనేవి లేకుండా పోతున్నాయి. ఇళ్లు, దుకాణాలు, బ్యాంకులు దోచుకోవడమే కాకుండా, చివరకు ప్రాణాపాయ స్థితిలో ఉండి చికిత్స పొందే ఆసుపత్రులను కూడా వదలడం లేదు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు.. అసలే అనారోగ్యంతో ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పడుతూ హాస్పిటల్‌కు వస్తే, అక్కడ కూడా దొంగలు తమ చేతివాటం ప్రదర్శించడం పట్ల ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘోరమైన చోరీ కలకలం రేపింది.

ఏం మనుషులురా..? వైద్యం కోసం వచ్చిన రోగిని వదలకుండా.. చేతివాటం చూపించారుగా!
Patient Gold Stolen
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Jun 03, 2026 | 8:34 AM

Share

శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ కిడ్నీ ఆసుపత్రిలో దారుణమైన చోరీ జరిగింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తెంబూరు గ్రామానికి చెందిన నారాయణమ్మ అనే మహిళ బుధవారం నాడు అనారోగ్య కారణాలతో పలాసలోని ప్రభుత్వ కిడ్నీ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు శుక్రవారం నాడు శస్త్రచికిత్స (ఆపరేషన్) చేశారు. ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లే ముందు వైద్యుల సూచనల ప్రకారం.. ఆమె మెడలో ఉన్న పసుపుతాడుకు చెందిన పావు తులం బంగారపు పుస్తెలను ఆమె కుమార్తె రాజేశ్వరి తీసి భద్రంగా తన పర్సులో పెట్టింది.

శనివారం ఉదయం రాజేశ్వరి తన తల్లిని వార్డులోని వాష్‌రూమ్‌కు తీసుకువెళ్లింది. తిరిగి వచ్చేసరికి రూమ్‌లో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి గదిని శుభ్రం చేసినట్లు, బెడ్ పై ఉన్న పాత బెడ్‌షీట్‌ను మార్చినట్లు గమనించింది. ఆ తర్వాత కాసేపటికి టిఫిన్ కొనడం కోసం డబ్బులు తీయడానికి రాజేశ్వరి తన పర్సు తెరిచి చూడగా ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అందులో దాచిన పావు తులం బంగారపు పుస్తెలతో పాటు రూ. 3 వేల నగదు కూడా మాయమయ్యాయి. చుట్టుపక్కల వారి బ్యాగులు వెతికినా ఫలితం లేకపోవడంతో బాధితురాలు కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇదే కాకుండా, పక్క వార్డులోని మరో రోగి ప్యాంట్ జేబులో ఉన్న రూ. 300 కూడా చోరీకి గురైనట్లు సమాచారం.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస భద్రత కరువైందని, మేనేజ్‌మెంట్ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న సమయంలో ఇలాంటి దొంగతనాలు జరగడం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ఆసుపత్రిలో పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలని, దొంగలను పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us