Mangalagiri: కోనేరు పునర్నిర్మాణం.. మురుగు తొలగిస్తుండగా అద్భుతం
Lakshmi Narasimha Temple: పెద్ద కోనేరును పునర్నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సంకల్పించారు. గత ఏడాది డిసెంబర్ లో పనులు మొదలు పెట్టారు. మొత్తం నీటిని తోడటానికే నాలుగు నెలల సమయం పట్టింది.

మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పెద కోనేరు మరోసారి వార్తల్లో నిలిచింది. గత ఆరు నెలలుగా పెద కోనేరు పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. విజయనగర రాజుల కాలంలో సుమారు 450 ఏళ్ళ క్రితం ఈ కోనేరు ను నిర్మించారు. మొదట్లో ఈ కోనేరు నుండే నీటిని తీసుకెళ్ళి నరసింహ స్వామి వారికి అభిషేకం చేసేవారు. ఇప్పటి వరకూ కేవలం మూడు సార్లు మాత్రమే మరమ్మతు పనులు జరిగాయి. బ్రిటీష్ పరిపాలన కాలంలో ఒకసారి కోనేరులో నీటిని మొత్తాన్ని తోడేశారు. అప్పుడు తుపాకులు కూడా బయట పడ్డాయి. అయితే గత కొన్నేళ్లుగా కోనేరు మూతపడింది. కోనేరు చుట్టూ ఇళ్ళ నిర్మాణం పెరిగిపోవటంతో మురికి కూపంలా తయారయింది. దీంతో కోనేరును పూర్తిగా మూసివేశారు.
ఈ క్రమంలో పెద్ద కోనేరును పునర్నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సంకల్పించారు. గత ఏడాది డిసెంబర్ లో పనులు మొదలు పెట్టారు. మొత్తం నీటిని తోడటానికే నాలుగు నెలల సమయం పట్టింది. నీళ్లు తగ్గిపోతున్న కొద్దీ అనేక నిర్మాణాలు బయటపడ్డాయి. కోనేరు పడమర గోడపై ఆంజినేయ స్వామి దేవాలయం మొదట బయటపడింది. ఆ తర్వాత ఈశాన్య మూలలో రెండు శివలింగాలు బయటపడ్డాయి. వీటిని తిలకించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
తాజా కోనేరులో మురుగు తొలగించే పనిలో సిబ్బంది ఉన్నారు. ఈ క్రమంలో కోనేరు మెట్లపై శివలింగాలున్న మెట్లు బయటపడ్డాయి. ఒక్కో మెట్టుపై ఐదు శివలింగాలున్నాయి. ఇలా రెండు మొట్లు బయటపడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు శివ లింగాలను తిలకించేందుకు కోనేరు వద్దకు వస్తున్నారు. ఇంకో రెండు నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆలయ అధికారులు అనుకుంటున్నారు. పునర్నిర్మాణం తర్వాత కోనేరును వాడుకలోకి తీసుకురావడమే కాకుండా స్వామి వారి తెప్పోత్సవం కూడా నిర్వహించాలని ఆలయ అర్చకులు భావిస్తున్నారు.
— రిపోర్టర్: టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..
