Viral Video: శ్రావణం మాసం రోజు శివాలయం ముందుకు ఏనుగుల గుంపు.. ఏం చేశాయో చూడండి!
జంతువులు చేసే కొన్ని పనులు జనాలను కొన్ని సార్లు భయాందోళనకు గురిచేసినా.. మరికొన్ని సార్లు ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే పార్వతీపురం మన్యం జిల్లాలో వెలుగు చూసింది. అడవిలోంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన ఓ ఏనుగుల గుంపు.. అక్కడే ఉన్న శివాలయం ముందు ఆగి.. ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్నట్టు కనింపించింది. ఈ దృశ్యం చూసిన స్థానిక జనాలు.. ఇది ఆ శివయ్య మహిమే అంటున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల సంచారం మరోసారి ఆసక్తిగా మారింది. విజయనగరం జిల్లా నుంచి తిరిగి మన్యం జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు జియ్యమ్మవలస మండలం పరజపాడు గ్రామ పరిసరాల్లో సందడి చేసింది. గ్రామ పొలిమేరల్లోని శివాలయం సమీపానికి చేరుకున్న ఏనుగుల గుంపు కొద్దిసేపు అక్కడే నిలవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. శివాలయం వద్దకు చేరుకున్న ఏనుగులు కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలిచి, ఆలయం వైపు చూసి తొండం పైకి ఎత్తి కనిపించాయి. అనంతరం నెమ్మదిగా అక్కడి నుంచి ముందుకు కదిలాయి.
ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు గజరాజులు శివుడిని దర్శించుకున్నాయి.. ఇది నిజంగా దేవుడి మహిమ అని మాట్లాడుకుంటూ ఆసక్తి వ్యక్తం చేశారు. కొందరు స్థానికులు తమ సెల్ఫోన్లలో ఈ అరుదైన దృశ్యాలను వీడియోలు, ఫొటోల రూపంలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఆ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.
అయితే ఏనుగుల గుంపు గ్రామ పరిసరాల్లో సంచరించడంతో ప్రజల్లో ఒకవైపు ఆసక్తి, మరోవైపు ఆందోళన నెలకొంది. ముఖ్యంగా పొలాల్లోకి ఏనుగులు ప్రవేశిస్తే పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఏనుగులను దగ్గరగా వెళ్లి చూడటం, వాటిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.
ఏనుగుల కదలికలను అటవీశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, గ్రామస్తులకు ముందస్తు సమాచారం అందించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. గజరాజుల సంచారం కారణంగా పరజపాడు గ్రామంలో ప్రస్తుతం ఆసక్తికర వాతావరణం నెలకొంది.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
