AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దూది, వత్తులతో పనిలేని వింత మొక్క: ప్రకృతి ప్రసాదించిన పూజా దీపం

పత్తి వత్తులు లేకుండానే కేవలం ఓ ఆకుతో దీపం వెలిగించవచ్చా? అవునంటోంది ‘పాండవ పత్తి’ మొక్క. ఏలూరు జిల్లా నాచుగుంటలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో సంరక్షిస్తున్న ఈ మొక్క ఆకును నూనె లేదా నెయ్యిలో ముంచి వెలిగిస్తే పత్తి వత్తిలా జ్యోతి వెలుగుతుంది. సహజసిద్ధమైన ఈ మొక్క విశేషం ఇప్పుడు ప్రకృతి ప్రేమికులు, భక్తులను ఆకట్టుకుంటోంది.

దూది, వత్తులతో పనిలేని వింత మొక్క: ప్రకృతి ప్రసాదించిన పూజా దీపం
Pandava Patti
B Ravi Kumar
| Edited By: |

Updated on: Aug 21, 2026 | 7:55 AM

Share

నిత్య పూజా విధానంలో దీపారాధనకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. దైవ సన్నిధిలో వెలిగించే జ్యోతికి సాధారణంగా దూదితో వత్తులు పేనడం మనకు తెలిసిన ఆచారం. అయితే ఎలాంటి దూది, వత్తుల ప్రమేయం లేకుండా కేవలం ఒక ఆకుతోనే దేవుడి ఎదుట నేరుగా దీపం వెలిగించవచ్చనే విషయం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మన ప్రాచీన ప్రకృతి సంపదలో దాగి ఉన్న అటువంటి అరుదైన వింత మొక్కే ‘పాండవ పత్తి’. ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో పరిరక్షించబడుతున్న ఈ సంప్రదాయ మొక్క ఇప్పుడు ప్రకృతి ప్రేమికులతో పాటు భక్తుల దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తోంది.

పాండవ పత్తి మొక్క అత్యంత విలక్షణమైన సహజ లక్షణాన్ని కలిగి ఉంటుంది. దీని ఆకు స్వభావరీత్యా నూనెను సులభంగా పీల్చుకుని, మంటను కొంతసేపు నిలకడగా కొనసాగించే గుణాన్ని కలిగి ఉంటుంది. పూజ సమయంలో పత్తి వత్తులు అందుబాటులో లేకపోయినా, ఈ మొక్క నుంచి తాజాగా కోసిన ఆకును ప్రమిదలో ఉంచి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిలో పూర్తిగా ముంచాలి. అనంతరం ఆకు పైభాగాన్ని వెలిగిస్తే పత్తి వత్తి మాదిరిగానే ప్రశాంతంగా, నిలకడగా జ్యోతి వెలుగుతుంది. ఎలాంటి పొగ లేదా దుర్వాసన లేకుండా దీపం వెలగడం ఈ ఆకులోని ప్రధాన విశేషంగా చెబుతున్నారు.

ప్రకృతి వ్యవసాయ గట్లపై జీవవైవిధ్య సంరక్షణ

రసాయన రహిత సమగ్ర వ్యవసాయ విధానాల్లో భాగంగా ఏలూరు జిల్లా నాచుగుంటకు చెందిన ఆదర్శ రైతు వెంకటరత్నం తన వ్యవసాయ క్షేత్రం గట్లపై ఈ పాండవ పత్తి మొక్కలను ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు. కేవలం వాణిజ్య పంటలు, ఆహార ధాన్యాలకే పరిమితం కాకుండా, నిత్య జీవితంలో ఉపయోగపడే సంప్రదాయ, ఔషధ విలువలు కలిగిన మొక్కలను సాగు చేయాలనే లక్ష్యంతో చేపల చెరువు గట్లపై వీటిని పెంచుతున్నారు.

తక్కువ నిర్వహణతో సహజ వాతావరణంలోనే ఏపుగా పెరిగే స్వభావం ఉండటంతో పెరటి తోటల్లో, పొలం గట్లపై సాగు చేసుకోవడానికి ఇది ఎంతో అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. రసాయనాలతో శుద్ధి చేసిన వాణిజ్య వత్తుల వినియోగం పెరుగుతున్న నేటి కాలంలో పాండవ పత్తి పూర్తి సహజసిద్ధమైన, పర్యావరణహితమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.

ఇళ్లలోని నిత్య పూజలతో పాటు దేవాలయాల్లో విశేష దీపారాధనలు, కార్తిక మాస పూజల్లోనూ ఈ ఆకులను నేరుగా వినియోగించే అవకాశం ఉంది. మన ప్రాచీన వృక్ష సంపదలో దాగి ఉన్న ఇలాంటి అపురూప జాతులను కాపాడుకుంటూ, భావితరాలకు పరిచయం చేయాల్సిన ఆవశ్యకతను ఈ మొక్క ప్రాచుర్యం గుర్తుచేస్తోంది.

Follow Us