AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనలాగ్ పనీర్‌పై దేశవ్యాప్త నిషేధం? ఫుడ్ సేఫ్టీపై FSSAI కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా ఆహార భద్రత నిబంధనల అమలుపై FSSAI దృష్టి సారించింది. ఇటీవలి నెలల్లో లక్షకు పైగా నోటీసులు జారీ చేయగా, సుమారు 5,000 లైసెన్సులు సస్పెండ్ చేసినట్లు FSSAI చీఫ్ రాజిత్ పున్హాని తెలిపారు. అనలాగ్ పనీర్‌పై దేశవ్యాప్తంగా నిషేధం విధించే అంశంపై సెప్టెంబర్ 24న రాష్ట్రాలతో సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్‌లో అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉన్న విషయాన్ని తెలియజేసే వార్నింగ్ లేబుల్స్ అమలుపైనా చర్యలు కొనసాగుతున్నాయి..

అనలాగ్ పనీర్‌పై దేశవ్యాప్త నిషేధం? ఫుడ్ సేఫ్టీపై FSSAI కీలక ప్రకటన
Analogue Paneer Ban Across India
Srilakshmi C
|

Updated on: Sep 17, 2026 | 10:14 AM

Share

హైదరాబాద్, సెప్టెంబర్ 17: భారత్‌లో ఆహార భద్రత నిబంధనల అమలు గతంతో పోలిస్తే క్రమంగా మెరుగుపడుతోందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) చీఫ్ రాజిత్ పున్హాని తెలిపారు. దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్, మసాలా ఉత్పత్తులపై తనిఖీలు పెరిగిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనిఖీల్లో ఉల్లంఘనలు లభించిన సందర్భాలే ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్నాయని, ప్రతి సంస్థ నిబంధనలు ఉల్లంఘిస్తోందని భావించకూడదని ఆయన స్పష్టం చేశారు. గత కొన్ని నెలల్లో ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన వారికి లక్షకు పైగా నోటీసులు జారీ చేసినట్లు పున్హాని తెలిపారు. దాదాపు 5 వేల ఫుడ్ లైసెన్సులు సస్పెండ్ చేయగా, 600 మందికి పైగా అరెస్టులు, సుమారు 1900 కేసుల్లో శిక్షలు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. దాదాపు 33 వేల కేసుల్లో జరిమానాలు విధించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు తనిఖీలను పెంచడంతో నిబంధనల పాటింపు క్రమంగా మెరుగుపడుతోందని, ఉల్లంఘనల శాతం కూడా తగ్గుతున్నట్లు గుర్తించామని పున్హాని వెల్లడించారు.

అనలాగ్ పనీర్‌పై దేశవ్యాప్త నిషేధం వస్తుందా?

ఇక అనలాగ్ పనీర్ విషయంలో FSSAI కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశంపై అన్ని రాష్ట్రాలతో సెప్టెంబర్ 24న సమావేశం నిర్వహించనున్నట్లు పున్హాని తెలిపారు. రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఏకాభిప్రాయం ఏర్పడితే దేశవ్యాప్తంగా అనలాగ్ పనీర్‌పై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అనలాగ్ పనీర్‌లో పాలకు బదులుగా లేదా పాలలోని కొన్ని భాగాల స్థానంలో వెజిటబుల్ ఆయిల్స్, స్టార్చ్, ఎమల్సిఫయర్లు వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాలు ఇప్పటికే దీనిపై చర్యలు తీసుకున్నాయని పున్హాని తెలిపారు. FSSAI ఇప్పటికే చీజ్ అనలాగ్‌ను ‘పనీర్’ పేరుతో విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ప్యాకేజ్డ్ ఫుడ్‌పై అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉన్న విషయాన్ని వినియోగదారులకు స్పష్టంగా తెలియజేసే హెచ్చరిక లేబుల్స్ అమలుకు ఇంకా కొంత సమయం పడుతుందని పున్హాని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ప్రతిపాదిత విధానంలో ఇటువంటి హెచ్చరికలను ఎరుపు రంగు హెక్సాగన్ గుర్తుల రూపంలో చూపించే అవకాశం ఉంది. అయితే తుది నిర్ణయం కోర్టు ప్రక్రియతో ముడిపడి ఉందని ఆయన తెలిపారు. నోటిఫికేషన్ విడుదల, ప్రజల నుంచి అభిప్రాయాల స్వీకరణ, WTO ప్రక్రియ, తయారీదారులకు ప్యాకేజింగ్ లేబుల్స్ మార్చుకునేందుకు సమయం ఇవ్వడం వంటి దశలు పూర్తి కావాల్సి ఉంటుంది. ఈ-కామర్స్, క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో విక్రయించే ఆహార ఉత్పత్తులపై కూడా FSSAI దృష్టి సారించింది. సెప్టెంబర్ 30, 2026లోగా ఆన్‌లైన్‌లో ఉత్పత్తుల తయారీ తేదీ, గడువు తేదీ, ప్యాకేజింగ్ వివరాలు వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా చేయాలని గడువు విధించినట్లు పున్హాని తెలిపారు. ఆన్‌లైన్‌లో విక్రయించే ఆహార ఉత్పత్తులకు కూడా భౌతిక దుకాణాల్లో ఉన్నట్టే ఆహార భద్రత ప్రమాణాలు వర్తిస్తాయని FSSAI స్పష్టం చేసింది. ఆహార ఉత్పత్తులు కొనుగోలు చేసేటప్పుడు లేబుల్, తయారీ తేదీ, గడువు తేదీ, పదార్థాల వివరాలు పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేటప్పుడు కూడా ఈ వివరాలు ముందుగానే కనిపించేలా మార్పులు తీసుకురానున్నారు.

Follow Us