బిగ్ అలర్ట్.. ఏపీలో కోవిడ్ కేసుల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గుర్తింపు!
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ జీనోమ్ సీక్వెన్సింగ్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ను గుర్తించారు. ఇది ఇతర ఒమిక్రాన్ ఉపవంశాల కంటే ప్రమాదకరమనే ఆధారాలు లేవని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రజలు భయపడకుండా, అప్రమత్తంగా ఉండాలి. గొంతు నొప్పి, దగ్గు వంటివి దీని లక్షణాలు.

ఆంధ్రప్రదేశ్లో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ను గుర్తించారు. కడప జిల్లాకు చెందిన నాలుగు నమూనాలను పూణే వైరాలజీ ల్యాబ్లో పరీక్షించగా ఈ వేరియంట్ నిర్ధారణ అయింది. అయితే ఈ వేరియంట్ ఇతర ఒమిక్రాన్ ఉపవంశాల కంటే ప్రమాదకరమనే ఆధారాలు లేవని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని అధికారులు తెలిపారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఒమిక్రాన్ RF.5 ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన ఒమిక్రాన్ ఉపవంశాల్లో ఒకటని అధికారులు తెలిపారు. సింగపూర్తో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో ఈ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ… ఇతర ఒమిక్రాన్ వేరియంట్ల కంటే ఇది ప్రమాదకరమనే శాస్త్రీయ ఆధారాలు లేవని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ వెల్లడించారు.
లక్షణాలు ఇవే..
గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం, అలసట, శరీర నొప్పులు RF.5 ప్రధాన లక్షణాలని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఆస్పత్రులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేశామని, ప్రత్యేక వార్డులు, పడకలు, కోవిడ్ పరీక్షల కిట్లు అందుబాటులో ఉంచామని మంత్రి సత్య కుమార్ వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
