Nimmagadda: 80 శాతం పోలింగ్ కావడం సంతోషకరం.. ఏపీ పంచాయతీ ఎన్నికలపై నిమ్మగడ్డ స్పందన..
ఏపీలో పంచాయతీ పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ 80 శాతం పోలింగ్ కావడం సంతోషకరమని తెలిపారు. ఆయన మాట్లాడుతూ..
Nimmagadda Press Meet On Local Election Poll Completes: మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థలు ఎన్నో వివాదాలకు దారి తీశాయి. ఓవైపు అధికారపక్షం, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలు ఇప్పుడే నిర్వహించకూడదని వాదిస్తుంటే.. మరోవైపు ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ పట్టు పట్టింది. ఈ నేపథ్యంలో ఈ విషయం సుప్రీం వరకు చేరుకోవడం, కోర్టు తీర్పు ఎన్నికల కమిషన్కు అనుకూలంగా రావడంతో రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ క్రమంలో నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లు ఎన్నో పరిణామాలు జరిగాయి. అయితే మొత్తం మీద ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నాలుగు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేశాయి. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ 80 శాతం పోలింగ్ కావడం సంతోషకరమని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కేవలం 16 శాతం మాత్రమే ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 50 శాతం మంది మహిళలు, బలహీన వర్గాలకు చెందిన వారు విజయం సాధించారు. మొత్తం నాలుగు విడతల్లో జరిగిన ఎన్నికల్లో 10,890 సర్పంచ్లు నేరుగా ఎన్నికయ్యారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసింది. సీఎస్, డీజీపీ ఎప్పటికప్పుడు సరైన సూచనలు చేశారు’ అని చెప్పుకొచ్చారు. ఇక నిమ్మగడ్డ మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి విడతలో 90 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో పాల్గొన్నారని, పోలీసులు వ్యాక్సినేషన్ ప్రక్రియను పక్కన పెట్టి విధులకు హాజరయ్యారని చెప్పుకొచ్చారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది, అవరోధాలు తొలగిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఆగిన దగ్గర నుంచి మొదలవుతుందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంత ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనాలని నిమ్మగడ్డ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికలపై త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపారు.