
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రచారం కోసం.. ప్రత్యేక వాహనాన్ని కూడా రూపొందించారు. దీనికి ఈ వాహనానికి వారాహిగా పేరు పెట్టారు. కాగా.. ఈ వాహనం రంగుపై ఇప్పటికే పొలిటికల్ హీట్ నెలకొంది. ఆలివ్ గ్రీన్ రంగు ఎలా వినియోగిస్తారంటూ ఏపీ అధికార పార్టీ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా.. పవన్ కల్యాణ్ ఎన్నికల రథం వారాహిపై తాజాగా.. ఏపీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. పవన్ కళ్యాణ్ వాహనం వారాహియా.. నారాహియా అన్న విషయం ప్రజలందరికీ తెలుసంటూ తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ వాహనం చూసి బయపడుతున్నామని నాదెండ్ల మనోహర్ చెప్పడం హాస్యా్స్పదం అంటూ పేర్కొన్నారు.
151 సీట్లు గెలుచుకున్న సీఎం జగన్.. రెండు చోట్ల ఓడిన పవన్ కల్యాణ్ను చూసి ఎందుకు భయపడతారంటూ రోజా పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఎవరి మీద యుద్ధం చేస్తున్నాడో ఆయనకే క్లారిటీ లేదంటూ పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఉంటున్న పవన్ కళ్యాణ్ శ్వాస పీల్చుకోవాలా వద్దా అని కేసీఆర్, కేటీఆర్లను అడగాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
పవన్ కల్యాన్కు ఏపీ మీద కాదు.. చంద్రబాబు మీదే ప్రేమ అంటూ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలిచి చిల్లర రాజకీయాలు చేసే వాళ్లను హైదరబాద్ కు తరిమేస్తారంటూ పేర్కొన్నారు. అమరరాజ కంపెనీ వ్యాపార వృద్ధికే హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిందన్నారు.
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు హెరిటేజ్ కంపెనీ రూ.15వేల కోట్లు హైదరాబాద్లో పెట్టుబడి పెట్టిందని గుర్తుచేశారు. అంటే చంద్రబాబు భార్యకి, కోడలికి ఆయనపై నమ్మకం లేనట్టా అని ప్రశ్నించారు.
అమరరాజ ఫ్యాక్టరీ విషయంలో బోడిగుండుకు, మోకాలికి లింకు పెడితే మర్యాద ఉండదంటూ మంత్రి రోజా టీడీపీ, జనసేన నేతలను ఉద్దేశించి పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..