AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వృద్ధురాలి ఇంట్లో భారీగా బంగారం, వెండి చోరీ.. నిందితుడు ఎవరో తెలిసి అవాక్కయిన స్థానికులు

కడపలో సీనియర్ సిటిజన్ ఇంట్లో జరిగిన రూ.75 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాల చోరీ కేసును తాలూకా పోలీసులు కేవలం 48 గంటల్లో ఛేదించారు. అయితే చోరీకి పాల్పడింది బాధితురాలి సొంత మనవడేనని దర్యాప్తులో తేలడంతో స్థానికంగా సంచలనం రేగింది.

వృద్ధురాలి ఇంట్లో భారీగా బంగారం, వెండి చోరీ.. నిందితుడు ఎవరో తెలిసి అవాక్కయిన స్థానికులు
Kadapa Gold Theft
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Aug 02, 2026 | 8:54 AM

Share

సాంకేతిక ఆధారాలతో కేవలం 48 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి, సుమారు రూ.75 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను కడప తాలూకా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ చోరీకి పాల్పడింది బాధితురాలి సొంత మనవడేనని దర్యాప్తులో తేలడంతో స్థానికంగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కడప నగరంలోని విజయదుర్గా కాలనీలో ఉన్న శ్రీ విజయదుర్గా రెసిడెన్సీ, ప్లాట్ నెం. 314లో నివాసముంటున్న సీనియర్ సిటిజన్ కుప్పం లీలావతమ్మ డయల్-100కు ఫోన్ చేసి, తన ఇంటి తాళాలు పగులగొట్టి సుమారు 664 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేశారు.

వెంటనే రంగంలోకి దిగిన కడప తాలూకా పోలీసులు, ఫింగర్‌ప్రింట్ నిపుణులు, డాగ్ స్క్వాడ్, సైబర్ క్రైమ్ బృందాలు ఘటనాస్థలాన్ని శాస్త్రీయంగా పరిశీలించాయి. అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించిన అధికారులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని గుర్తించారు. ఆ ఫొటోను ఫిర్యాదిదారుకు చూపించగా, అతను బాధితురాలి మనవడు కుప్పం శంకర్ నాథ్ అని నిర్ధారణ అయింది.

ఆ తర్వాత సైబర్ క్రైమ్ బృందం నిందితుడి కదలికలను ట్రాక్ చేసి, అతను హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించింది. ప్రత్యేక పోలీసు బృందాలు హైదరాబాద్ వెళ్లి అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

నేరానికి దారితీసిన కారణం

దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, నిందితుడి కుటుంబానికి అతని నానమ్మతో కొంతకాలంగా ఆస్తి వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ కుటుంబ విభేదాలు, వ్యక్తిగత అసంతృప్తే చోరీకి ప్రధాన కారణమని నిందితుడు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

నానమ్మ హైదరాబాద్‌కు వెళ్లిన విషయం తెలుసుకున్న నిందితుడు గత నెల 29న హైదరాబాద్ నుంచి కడపకు వచ్చి, ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. అనంతరం అల్మారాలో భద్రపరిచిన 664 గ్రాముల బంగారు ఆభరణాలు, 700 గ్రాముల వెండి వస్తువులను చోరీ చేసి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లినట్లు విచారణలో తేలింది.

నిందితుడి వద్ద నుంచి 664 గ్రాముల బంగారు ఆభరణాలు, 700 గ్రాముల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ సుమారు రూ.75 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

అయితే, ఇంత పెద్ద చోరీ కేసును కేవలం 48 గంటల్లో ఛేదించి పూర్తి స్థాయిలో రికవరీ చేసినప్పటికీ, ఈ కేసు విషయంలో పోలీసులు మీడియా సమావేశం నిర్వహించకపోవడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి కీలక కేసుల వివరాలను మీడియా సమావేశం ద్వారా వెల్లడించే ఆనవాయితీ ఉన్నప్పటికీ, ఈ కేసులో మాత్రం కేవలం పత్రికా ప్రకటన విడుదల చేసి పరిమిత సమాచారంతోనే సరిపెట్టారు. దీంతో ఈ కేసును లో-ప్రొఫైల్‌లో ముగించేందుకు ప్రయత్నించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us