AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSRCP: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సీఎం జగన్‌ కసరత్తు..! అప్పటికల్లా 175 సీట్లకు అభ్యర్థుల ఎంపిక చేయాలని తీర్మానం..

Andhra Pradesh: వైసీపీ అధినేత జగన్‌ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారా?.. ఆగస్టు లాస్ట్‌కి అభ్యర్థులను కూడా ప్రకటించబోతున్నారా?.. గ్రౌండ్‌ రిపోర్ట్‌లతో ఎమ్మెల్యే క్యాండేట్ల ఫైనల్‌ లిస్టు రెడీ చేస్తున్నారా?.. వై నాట్‌ 175 విషయంలో తగ్గేదేలే అంటున్నారా?.. ఫైనల్‌ లిస్టులో ఉండేదెవరు?, ఊడేదెవరు?..

YSRCP: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సీఎం జగన్‌ కసరత్తు..! అప్పటికల్లా 175 సీట్లకు అభ్యర్థుల ఎంపిక చేయాలని తీర్మానం..
CM Jagan
శివలీల గోపి తుల్వా
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 14, 2023 | 7:30 AM

Share

ఏపీలో అధికార వైఎస్సార్సీపీ అసెంబ్లీ ఎన్నికల కసరత్తు మొదలు పెట్టేసింది. ఏడాది కాలంగా నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోనే ఉండేలా చర్యలు తీసుకున్న వైసీపీ అధినేత జగన్.. ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్టులు తెప్పించుకుంటూ అభ్యర్థుల విషయంలో ఓ క్లారిటీకి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో నిర్వహించిన వర్క్ షాపుల్లోనూ కొంతమందికి టిక్కెట్లు అనుమానమేనని ముందుగానే తేల్చేశారు. ఆయా రిపోర్ట్‌లను బట్టి సీఎం జగన్‌ ఫైనల్ లిస్ట్ కూడా తయారు చేసే పనిలో పడ్డట్లు టాక్‌ వినిపిస్తోంది. దానిలో భాగంగా.. ఆగస్టు చివరి నాటికి మొత్తం 175 సీట్లకు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కొంతమందికి ఇప్పటికే సీట్లు కన్ఫర్మ్ కూడా చేసినట్లు తాడేపల్లి వర్గాల సమాచారం.

గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచి రికార్డ్ సృష్టించిన వైసీపీ.. ఈసారి 175 సీట్లు టార్గెట్‌గా ముందుకు వెళ్తోంది. దానికి దగ్గట్లే.. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్నారు వైసీపీ అధినేత జగన్‌. కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చేశారని ప్రచారం జరుగుతోంది. నివేదికలు కొంచెం వ్యతిరేకంగా ఉన్న చోట్ల మాత్రం మరో నెలలో ఫైనల్‌ రిపోర్టులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. సుమారు 40 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. వారిని మార్చే పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల స్థానంలో కొత్తవారికి టిక్కెట్ ఇస్తే గ్రూపు తగాదాలు తెరపైకి వస్తాయేమోనన్న అంశాలను పరిశీస్తున్నారట సీఎం జగన్‌.

ఇదిలావుంటే.. గతంలో మంత్రులుగా పనిచేసిన కొంతమంది, ఎమ్మెల్యేల్లో కొంతమందికి మార్పు తప్పదని వైసీపీ ముఖ్య నేతలే చెప్తుండటం ఆసక్తిగా మారుతోంది. ఇక.. కొన్ని చోట్ల ఎంపీలకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇస్తారని కూడా టాక్‌ నడుస్తోంది. ముందస్తు ఎన్నికలు లేవని స్వయంగా ప్రకటించిన జగన్‌.. అభ్యర్థులను మాత్రం ముందుగానే డిక్లేర్‌ చేసి గ్రూపు తగాదాలకు చెక్ పెట్టి, ప్రజల్లోకి వెళ్లేలా చేయాలనే ఆలోచనలో ఉన్నారు సీఎం జగన్‌. దానిలో భాగంగానే… ఆగస్టు చివరికి అభ్యర్థుల తుది జాబితా సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే.. సీఎం లిస్ట్‌లో చాన్స్‌ దక్కేదెవరికి?.. మిస్సయ్యేదెవరికి అనే విషయం మాత్రం అప్పుడే లీక్ చేయకూడదని నిర్ణయించారట సీఎం జగన్‌. ఇతర పార్టీలకంటే ముందుగానే ఎమ్మెల్యే క్యాండేట్ల లిస్ట్ రిలీజ్ చేసి అనుకున్న టార్గెట్ రీచ్‌ అయ్యేలా అధినేత కసరత్తు చేస్తున్నారని వైసీపీ ముఖ్య నేతలు చెప్తున్నారు. మొత్తంగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సీఎం జగన్‌.. గట్టిగానే ముందస్తు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. సీఎం జగన్‌ ఫైనల్‌ లిస్టులో ఎవరుంటారు?.. ఎవరికి చాన్స్‌ మిస్సవుతుందన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..