Chiranjeevi: సేనానికి తోడుగా చిరు.. తమ్ముడికి ఓటు వేయాలని అన్నయ్య పిలుపు.. ట్విస్ట్ ఇదే
తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ది అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. ‘జనమే జయం’ అని నమ్మే జనసేనానిని గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను చిరంజీవి పోస్ట్ చేశారు.
యస్.. అనుకున్నదే జరిగింది. జనసేన అధ్యక్షుడు పవన్కు మద్దతు తెలిపారు.. మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు పవన్కు ఓటు వేయాలని ఓట్లు అభ్యర్థిస్తూ వీడియో రిలీజ్ చేశారు. అమ్మ కడుపున ఆఖరిగా పుట్టినా.. అందరికీ మేలు చేయాలి.. అందరికీ మేలు జరగాలి అనే విషయంలో పవన్ ముందుంటారని చిరు చెప్పారు. తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు పవన్ కళ్యాణ్ది అని కొనియాడారు. అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారనీ, తన తమ్ముడు మాత్రం సొంత డబ్బుని ఖర్చు పెట్టి కౌలు రైతులను ఆదుకున్నాడని, దేశం కోసం పోరాడే జవాన్లకు ఇచ్చాడని అన్నారు. తన తమ్ముడు బలవంతంగా ఇండస్ట్రీకి వచ్చాడని, కానీ ఇష్టంగా పాలిటిక్స్లోకి వచ్చినట్లు తెలిపారు చిరంజీవి. ఏ తల్లికైనా సరే తన తనయుడ్ని అనరాని మాటలు అంటే గుండె తరక్కుపోతుందని, అలానే తమ్ముడిని అకారణంగా తిడుతుంటే ఏ అన్నకి అయినా బాధ వేస్తుంది అన్నారు చిరు. పవన్ను తిడుతున్నారని.. తన తల్లి బాధ పడుతుంటే.. అమ్మకు ఒకటే మాట చెప్పారట చిరు. ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ల బిడ్డల కోసం చేస్తున్న ఈ యుద్ధం ముందు.. మన బాధ పెద్దది కాదు అని అన్నారట.
తన తమ్ముడిలాంటి నాయకులను చట్ట సభలకు పంపించాలని.. పిఠాపురంలో జనసేనకు ఓటు వేయండని మెగాస్టార్ కోరారు. పవన్ కళ్యాణ్ని గెలిపించండి.. మీకు సేవకుడిగా, సైనికుడిగా అండగా నిలబడతాడు..కలబడతాడు.. పిఠాపురం వాస్తవ్యులకు నమస్కారం, గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి.. గెలిపించండి.. జై హింద్.. అని చిరంజీవి వీడియోని ముగించారు. అయితే చిరు కేవలం వ్యక్తిగతంగా పవన్కు ఓటెయ్యాలని కోరారు తప్ప.. రాష్ట్రవ్యాప్తంగా జనసేన అభ్యర్థులకు ఓటు వేయాలని చెప్పలేదు. ఇది ఇప్పుడు కొత్త అనుమానాలకు కారణమైంది. కాగా అనకాపల్లిలో బీజేపీ తరఫున కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న సీఎం రమేష్, అలానే కైకలూరులో బీజేపీ తరఫున కూటమి అభ్యర్థిగా ఉన్న కామినేని శ్రీనివాస్లకు వ్యక్తిగతంగా సపోర్ట్ చేశారు చిరంజీవి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..