Chandrababu Arrest Updates: ఏపీ హైకోర్టు ముందుకు నేడు చంద్రబాబు, లోకేష్ పిటిషన్లు..
Chandrababu Arrest Updates: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్. అమరావతిలోని అన్ని రోడ్లను కలుపుతూ అప్పటి టీడీపీ ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రాజెక్ట్ ఇది. అయితే, ఈ ప్రాజెక్ట్లో భారీ స్కామ్ జరిగిందంటూ కంప్లైంట్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో అక్రమాలకు పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో గతేడాది రంగంలోకి దిగింది ఏపీ సీఐడీ.

Chandrababu Arrest Updates: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్పై ఇవాళ విచారణ జరుగనుంది. ఇప్పటికే న్యాయవాది లూథ్రా తన వాదనలు వినిపించారు. ఇవాళ మరోసారి వాదనలు విననున్న హైకోర్టు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించనున్నారు. మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. ఇక శుక్రవారం నారా లోకేష్ ముందస్తు బెయిల్పై విచారణ జరుగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బెయిల్ పిటిషన్ వేశారు లోకేష్. ఈ కేసులో నారా లోకేష్ను A14గా పేర్కొంది సీఐడీ.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబును ఏ1గా, మాజీ మంత్రి నారాయణను ఏ2గా చేర్చింది సీఐడీ. ఇదే కేసులో నారా లోకేష్ను ఏ14గా చేర్చుతూ మెమో దాఖలు చేసింది. అయితే, ఈ కేసులో నారాయణ ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందగా… చంద్రబాబు, లోకేష్లు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండు పిటిషన్లపై ఇవాళ విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు.
మరోవైపు స్కిల్ డవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టయిన చంద్రబాబు 20 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రెండు వారాలుగా ఢిల్లీలోనే నారా లోకేష్ ఉండగా.. 20 రోజులుగా రాజమండ్రి టిడిపి క్యాంప్ శిబిరంలోనే బస చేస్తున్నారు భువనేశ్వరి, బ్రాహ్మణి. రోజుకి నాలుగు సార్లు ఇంటి భోజనం, బ్లాక్ కాఫీ, వేడి నీళ్లు, స్నాక్స్ చంద్రబాబుకు తీసుకెళుతున్నారు ఆయన వ్యక్తిగత సిబ్బంది. ఇవాళ చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. పార్టీలోని సీనియర్ నాయకుల సలహా మేరకు ఇవాళ మళ్లీ తిరిగి మొదలుపెట్టాలనుకున్న యువగళం పాదయాత్రను వాయిదా వేసుకున్నారు నారా లోకేష్.
అటు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడడం.. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్పై విచారణ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో మరికొద్ది రోజులు చంద్రబాబు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇవాళ కుటుంబ సభ్యులు ములాఖత్లో చంద్రబాబును కలవనున్నారు. వారానికి 2 ములాఖత్లకు మాత్రమే అవకాశం ఉండడంతో ఇవాళ చంద్రబాబును కలవాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
అటు, రేపు టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరగబోతోంది. నంద్యాలలో ఈ సమావేశం జరగనుండగా.. జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొననున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కొత్త కార్యక్రమాలతో టీడీపీ పార్టీ జనాల్లోకి వెళ్లాలని భావిస్తున్నందన.. ఆ కార్యాచరణపై పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో చర్చించి.. కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
