YCP Kapu Leaders Meet: పవన్ సింగిల్గా పోటీ చేయగలరా..? ప్రశ్నలు సంధించిన వైసీపీ కాపు నేతల సమావేశం
2019కి ముందు, ఆ తర్వాత కాపుల పరిస్థితిని, వారికి అందిన పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది వైసీపీ. అందుకోసం కాపు నేతలందరితో విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవాడలో నిర్వహించబోతోంది.
ఆంధ్రప్రదేశ్లో 2019కి ముందు, ఆ తర్వాత కాపుల పరిస్థితిని, వారికి అందిన పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది వైసీపీ. అందుకోసం కాపు నేతలందరితో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏపీలోని విజయవాడలో నిర్వహించబోతోంది. రాజమండ్రిలో భేటీ అయిన కాపు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సుదీర్ఘంగా చర్చించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాపులకు ఎక్కువ మేలు చేసింది.. వైఎస్ఆర్ సీపీనే అంటూ పేర్కొన్నారు.
ఏపీలో కాపుల చుట్టూ మళ్లీ రాజకీయం మొదలైన నేపథ్యంలో రాజమండ్రిలో వైసీపీకి చెందిన ఆ సామాజికవర్గ కీలక ప్రజాప్రతినిధుల భేటీ ఆసక్తిగా మారింది. వైసీపీలోని కాపు నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఈ సమావేశం తీవ్రంగా ఖండించింది. టీడీపీ హయాంలో, ఇప్పుడు కాపుల పరిస్థితి, వారికి అందిన, అందుతున్న పథకాలపై చర్చించారు నేతలు. 2014 నుంచి 2019 వరకు రెండు లక్షల 54 వేల మంది కాపులకు 1824 కోట్ల సాయం అందితే, ఈ మూడున్నరేళ్లలో 70 లక్షల 83 వేల మందికి 26 వేల 490 కోట్ల లబ్ది చేకూరిందని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వివరించారు.
మరోవైపు ఇటీవల వైసీపీలోని కాపు నేతలపై, రంగా హత్యపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబును కలవడంపైనా సమావేశంలో చర్చించారు. చంద్రబాబు కోసమే జనసేన అధ్యక్షుడు పని చేస్తున్నారని విమర్శించారు మంత్రులు. జనసేన సెలబ్రిటీ పార్టీ అని, చంద్రబాబు కోసం పని చేయకపోతే పవన్ కల్యాణ్ 175 సీట్లలో సింగిల్గా పోటీ చేయగలరా అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ ప్యాకేజ్ కోసమే పని చేస్తున్నారని తాము ముందు నుంచి చెబుతున్నదే నిజమైందంటూ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
కాగా.. ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చింది జనసేన. వైసీపీ నుంచి కాపుల్లో ఎవరినైనా సీఎం అభ్యర్థిగా ప్రకటించే దమ్ము ఉందా అని ఆ పార్టీని ప్రశ్నించారు జనసేన నేత కందుల దుర్గేష్.
మరోవైపు కాపుల అంశంపై చర్చించేందుకు త్వరలోనే విజయవాడలో భేటీ కావాలని వైసీపీ నేతలు నిర్ణయించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..