క్రిమినల్ లాయర్ ఇంటికే కన్నం వేశారు దొంగలు. ముందు పక్కాగా రెక్కీ నిర్వహించి అనంతరం చోరీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. లాయర్ కుటుంబంతో సహా నెల్లూరులోని ఓ వివాహ కార్యక్రమానికి హాజరవుతున్నారని ముందుగానే తెలుసుకున్న దొంగలు రాత్రి వేచి చూసి పక్కాగా ప్లాన్ అమలు చేసినట్టు కనిపిస్తోంది. అయితే ఇంట్లో ఓ కాపలా కుక్క ఉన్నా కూడా, దానికి మత్తుమందు ఇచ్చి పడుకోబెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. కొత్తవాళ్లు ఎవరు కనిపించినా అరచి నానా హంగామా చేసే కుక్క మన్నుతిన్న పాములా పడి ఉండటాన్ని బట్టి కుక్కపై మత్తు మందు ప్రయోగించి ఉంటారని పలు క్రిమినల్ కేసులు వాదించిన లాయర్ అనుమానిస్తున్నారు. అంతే కాకుండా ఇంట్లో పలుచోట్ల డబ్బులు దాచి ఉంచినా కేవలం ఒక చోట దొరికిన 10 లక్షలు రూపాయలు మాత్రమే తీసుకుని ఉడాయించారు. బీరువాలో 30 సవర్ల బంగారం ఉన్నా వాటి జోలికి మాత్రం వెళ్లలేదట. దీంతో లాయర్ ఇంటికి కేసుల విషయంలో మాట్లాడానికి వచ్చిన దొంగలే పక్కగా ప్లాన్ చేసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఒంగోలులోని ప్రముఖ క్రిమినల్ లాయర్ నాగిశెట్టి మోహన్దాస్ ఇంట్లో జరిగిన ఈ చోరీ నగరంలో కలకలం రేపింది.
నెల్లూరులో ఓ వివాహానికి హాజరయ్యేందుకు మోహన్దాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళారు. రాత్రి అక్కడే బస చేశారు. తెల్లారేసరికి ఇంట్లో చోరీ జరిగిందని పనిమనిషి ఫోన్ చేసి చెప్పడంతో ఒంగోలుకు చేరుకున్నారు. ఇంట్లో చోరీ జరిగిందని నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో వివిధ ప్రాంతాల్లో దాచి ఉంచిన 10 లక్షల రూపాయల నగదు అపహరణకు గురైందని గుర్తించారు. బీరువాలో ఉన్న 30 సవర్ల బంగారం అలాగే ఉంది. దీంతో దొరికినంత వరకు డబ్బులు తీసుకుని దొంగలు పరారై ఉంటారని ఇంటి యజమాని మోహన్దాస్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మోహన్దాస్ ఇంట్లో ఉన్న కుక్క దొంగలు వచ్చిన సమయంలో అరచినట్టు దాఖలాలు కనిపించలేదని, బహుశా కుక్కకు మత్తుమందు ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ మేరకు లాయర్ మోహన్దాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చోరీ జరిగిన ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. లాయర్ మోహన్దాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఒంగోలు 1టౌన్ సిఐ లక్ష్మణ్ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..