Atchuthapuram Blast : రియాక్టర్ పేలుడుతో పెరుగుతున్న మృతుల సంఖ్య.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్!

ప్రమాదంలో గాయపడిన వారిని అత్యావసర చికిత్స కోసం అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. గాయపడ్డ వారిలో ఐదుగురు 60 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెద్యులు వెల్లడించారు.. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో దాదాపు 300 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం.

Atchuthapuram Blast : రియాక్టర్ పేలుడుతో పెరుగుతున్న మృతుల సంఖ్య.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్!
Atchuthapuram Blast

Updated on: Aug 21, 2024 | 9:46 PM

అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనలో మృత్యుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో రియాక్టర్‌ పేలిన ఘటనలో ఇప్పటి వరకు 18 మంది మృతి చెందగా, మరో 50మందికి పైగా గాయపడ్డారు. రియాక్టర్ పేలిన భవన శిథిలాల కింద పలు మృతదేహాలున్నాయని తోటి కార్మికులు చెబుతున్నారు. శిథిలాలు తొలగించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. 12 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు. భోజన విరామ సమయం మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టంగా అలుముకున్న పొగతో అంతా చీకటిగా మారింది. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. పేలుడు ధాటికి భారీ శబ్దంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫార్మా సెజ్ లోని అగ్నిమాపక యంత్రం సహా చుట్టుపక్కల నుంచి మరో 11 యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేశాయి.

ప్రమాదంలో గాయపడిన వారిని అత్యావసర చికిత్స కోసం అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. గాయపడ్డ వారిలో ఐదుగురు 60 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెద్యులు వెల్లడించారు.. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో దాదాపు 300 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..