Speaker Tammineni: కౌరవులంతా కలిసి వచ్చినా… మళ్ళీ జగన్ని గెలిపించాలని ప్రజలకు తమ్మినేని పిలుపు
జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ ఏపీకి సీఎం అని ప్రతి గడపలో వినిపిస్తోందన్నారు స్వీకర్ తమ్మినేని. వచ్చే ఎన్నికల్లో జగన్నాధుని రథచక్రాల కింద ప్రతిపక్షాలన్నీ నలిగిపోవాల్సిందేననిఘాటు వ్యాఖ్యలు చేశారు తమ్మినేని సీతారాం.
Speaker Tammineni: మహానాడు కాదు అది వల్లకాడు అంటూ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం విశాఖ పట్నం వేదికగా జరిగిన సామాజిక న్యాయ భేరీ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కుళ్ళి, కృశించిపోయిన టీడీపీకి మహానాడులో దహన సంస్కారాలు చేస్తున్నారంటూ స్పీకర్ ఘాటు కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సామాజిక న్యాయ సునామీలో ప్రతిపక్షాలన్నీ కొట్టుకుపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక కోనసీమ-అంబేడ్కర్ జిల్లా అంటే తప్పేంటని.. అసలు కోనసీమ అంబేడ్కర్ జిల్లాను విపక్షాలు సమర్థిస్తున్నారో వ్యతిరేకిస్తున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అసలు “దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా, బీసీలను తోకలు కత్తిరిస్తా.. తోలుతీస్తా” అన్న చంద్రబాబు ఒక నాయకుడా..అంటూ వ్యాఖ్యానించారు తమ్మినేని. మేనిఫెస్టోను తుంగలో తొక్కిన వ్యక్తి, చరిత్ర హీనుడు చంద్రబాబు. 2014లో అనేక హామీలు ఇచ్చి, ఏ ఒక్క హామీని అమలు చేయని వ్యక్తి చంద్రబాబని అన్నారు.
కుల, మత, పార్టీలకతీతంగా తమ ప్రభుత్వం నేడు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అదే టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలతో దోపిడీ చేశారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ ఏపీకి సీఎం అని ప్రతి గడపలో వినిపిస్తోందన్నారు స్వీకర్ తమ్మినేని. వచ్చే ఎన్నికల్లో జగన్నాధుని రథచక్రాల కింద ప్రతిపక్షాలన్నీ నలిగిపోవాల్సిందేనని అన్నారు తమ్మినేని సీతారాం.
శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే
రాష్ట్రంలో అవినీతి, పేదరికాన్ని పారదోలుతామంటూ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మడమ తిప్పకుండా, వెన్ను చూపకుండా జగన్ అన్నివర్గాల ప్రజానీకానికి సమన్యాయం, సామాజిక న్యాయం చేస్తూ పరిపాలనను ముందుకు పరుగులు తీయిస్తున్నారని చెప్పారు. ఇంత గొప్పగా సామాజిక న్యాయం జరుగుతుంటే విపక్షాలు విమర్శలు చేయడమే కాకుండా రాష్ట్రంలో అల్లర్లు, విధ్వంసాలకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
పేదరికాన్ని తొలగించేలా అనేక సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు నేరుగా ఇంటి దగ్గరకే ముఖ్యమంత్రి చేరుస్తున్నారు. ముఖ్యమంత్రిగారు నేరుగా బటన్ నొక్కితే లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇవాళ నగదు జమ అవుతోంది. మధ్యలో దళారులు, రాజకీయాలకు తావు లేవు. గతంలో టీడీపీ హయాంలో దోపిడీ చేసిన జన్మభూమి కమిటీలు ఈరోజు రాష్ట్రంలో లేవు. రాష్ట్రంలో సంతృప్తికరమైన పరిపాలన కొనసాగుతోంది. గడప గడపకు ప్రభుత్వం కార్యాక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్లి పథకాలు గురించి వివరించినప్పుడు, మళ్లీ జగన్ ను గెలిపిస్తామని ప్రజలు అంటున్నారని తెలిపారు స్వీకర్.
అంతేకాదు రాబోయే ఎన్నికల క్షేత్రంలో, మహాభారతంలో కౌరవులంతా కట్టకట్టుకుని వచ్చినా, మనమంతా ఏకమై వైయస్సార్ సీపీని గెలిపించుకోవాలని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు స్వీకర్ తమ్మినేని. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో జగన్నాధుడి రథచక్రాల కింద విపక్షాలు నలిగి, నశించి కుంగి కృశించిపోవాల్సిందేనని చెప్పారు. వైసీపీకి వేసే ప్రతి ఓటు సామాజిక న్యాయం, మన ఆత్మ గౌరవం నిలబెట్టుకోవడం కోసం వేసేందుకు తోడ్పాటు అవుతుందన్నది విషయం ఏపీ ప్రజలు గుర్తు పెట్టుకోవాలని సూచించారు స్వీకర్ తమ్మినేని.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.