AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి విమాన ప్రయాణంలో చేదు అనుభవం!

ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సహా పలువురు ప్రయాణికులు బెంగళూరు విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయవాడకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ATC క్లియరెన్స్ లేక దాదాపు నాలుగు గంటలు ఆలస్యమైంది. విమానంలోనే వేచి ఉన్న ప్రయాణికులకు సరైన సమాచారం లేకపోవడంతో అసహనం వ్యక్తమైంది. మంత్రి బందీ అయిన ఈ ఘటన చర్చనీయాంశమైంది.

ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి విమాన ప్రయాణంలో చేదు అనుభవం!
Ap Minister Ramprasad Reddy
Balaraju Goud
|

Updated on: Aug 31, 2026 | 1:53 PM

Share

ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. విజయవాడకు రావాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం గంటల తరబడి బెంగళూరు విమానాశ్రయంలోనే నిలిచిపోవడంతో మంత్రి సహా పలువురు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు నాలుగు గంటలుగా విమానంలోనే ప్రయాణికులు వేచి ఉన్నట్లు సమాచారం.

సోమవారం (ఆగస్టు 31) ఉదయం 7.10 గంటలకు బెంగళూరు నుంచి విజయవాడకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ IX2875 విమానం నిర్ణీత సమయానికి బయలుదేరలేదు. సమయం గడుస్తున్నప్పటికీ విమానం కదలకపోవడంతో ప్రయాణికుల్లో అసహనం పెరిగింది. విమానం ఆలస్యానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) క్లియరెన్స్ అందకపోవడమే కారణమని ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి.

అయితే గంటల తరబడి విమానంలోనే కూర్చొని ఉన్న తమకు విమానం ఎప్పుడు బయలుదేరుతుందనే దానిపై స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఫ్లైట్ స్టేటస్‌లో కూడా బయలుదేరే సమయం మారుతూ ఉండటంతో ప్రయాణికుల నిరీక్షణ కొనసాగింది. ఈ విమానంలో ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులు, ఇతర ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మంత్రి కూడా మిగతా ప్రయాణికులతో కలిసి విమానం బయలుదేరేందుకు ఎదురుచూస్తున్నారు.

సాధారణంగా విమానాలు ఆలస్యమైనప్పుడు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదా తదుపరి అప్‌డేట్‌లను ఎయిర్‌లైన్స్ అందిస్తుంది. అయితే ఈ ఘటనలో గంటల తరబడి విమానంలోనే వేచి ఉండాల్సి రావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ATC క్లియరెన్స్ ఎప్పుడు లభిస్తుంది? విమానం విజయవాడకు ఎప్పుడు బయలుదేరుతుంది? అనే దానిపై ప్రయాణికుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. విమానం బయలుదేరే సమయంపై ఎయిర్‌లైన్ నుంచి తదుపరి అధికారిక సమాచారం కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.

మొత్తంగా.. ఉదయం విజయవాడకు చేరుకోవాల్సిన ప్రయాణికులు బెంగళూరు ఎయిర్‌పోర్టులోనే గంటల తరబడి చిక్కుకుపోయారు. మంత్రి సహా ప్రయాణికులు నాలుగు గంటల పాటు విమానంలో నిరీక్షించాల్సి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us