Pawan Kalyan: వీరజవాన్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా.. ప్రభుత్వం తరపున రూ.50 లక్షలు, పవన్ రూ.25లక్షల ప్రకటన!
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ దేశ రక్షణలో వీరమరణం పొందిన సైనికుడు మురళీనాయక్ భౌతికకాయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. జవాన్ స్వస్థలమైన కళ్లితండాకు వెళ్లి మురళీనాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర స్థాయి చేరాయి. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ప్రతీకార దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో భారత్కు చెందిన ఆర్మీ జావాన్లు దేశ రక్షణలో వీరమరణం పొందారు. వారిలో ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ కూడా ఉన్నారు. దేశ రక్షణలో వీరమరణం పొందిన మురళీనాయక్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు ప్రజలు సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళీనాయక్ అంతక్రియల్లో పాల్లొని నివాళులర్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే దేశ రక్షణలో వీరమరణం పొందిన సైనికుడు మురళీనాయక్ భౌతికకాయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. జవాన్ స్వస్థలమైన కళ్లితండాకు వెళ్లి మురళీనాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ కుటుంబానికి అండగా ఉంటాయని భరోసా నిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. దీనితో పాటు మురళీనాయక్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బాధిత కుటుంబానికి ఐదెకరాల భూమితో పాటు 300 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. మురళీ నాయక్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం తరపున కాకుండా మురళీనాయక్ కుటుంబానికి తాను కూడా వ్యక్తిగత ఆర్థిక సాయం ప్రకటించారు. మురళీనాయక్ కుటుంబానికి తన తరపున రూ.25లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. వీరజవాన్ కుటుంబానికి ఎలాంటి సహాయం కావాలన్న చేసేందుకు సిద్ధంగా ఉన్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. మరో వైపు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఆర్థిక సాయం ప్రకటించారు. తన నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు.
2022లో అగ్నివీర్ జవానుగా సైన్యంలో చేరిన మురళీనాయక్ ఇప్పటివరకు రెండున్నరేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారు. మొన్నటి వరకు నాసిక్లో విధులు నిర్వహించిన మురళీనాయక్.. ఆర్మీ అధికారుల పిలుపుతో ఆపరేషన్ సింధూర్ తర్వాత జమ్ముకశ్మీర్లో విధులకు వెళ్లారు. భారత్-పాకిస్తాన్ మధ్య రాజౌరిలో జరిగిన కాల్పుల్లో మురళీనాయక్ వీరమరణం పొందారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..