Andhra Pradesh: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. నిత్యావసర సరుకులపై సబ్సిడీ..
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి మరో గుడ్ న్యూస్. తక్కువ ధరకే నాణ్యమైన నిత్యావసర సరుకులు లభించనున్నాయి. రేషన్ షాపులతో సంబంధం లేకుండా మినీ మార్టుల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి ద్వారా ప్రజలకు తక్కువ ధరకే సబ్సిడీపై నిత్యావసర సరుకులు అందిస్తారు.

ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి కూటమి సర్కార్ భారీ గుడ్ న్యూస్ తెలిపింది. రేషన్ షాపుల ద్వారా కార్డు ఉన్నవారికి తక్కువ ధరకే బియ్యం, పంచదార, రాగులు, జొన్నలు వంటివి అందిస్తుండగా.. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ దుకాణాలకు తోడు రాష్ట్రంలో మినీ మార్టుల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా ప్రకటించారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మార్టులు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. వీటిల్లో రేషన్ కార్డు ఉన్నవారందరికీ అత్యంత తక్కవ ధరకే నాణ్యమైన నిత్యావసర సరుకులు అందించనున్నారు.
రాయితీపై సరుకులు
ఈ మినీ మార్టుల్లో పంచదార, గోధుమ పిండి, పామాయిల్, మిల్లెట్స్, ఇతర నిత్యావసర సరుకులను సబ్సిడీ ధరల్లో అందిస్తారు. తక్కువ ధరకే అందించడం వల్ల సామాన్యులకు సరుకులపై ఖర్చు భారం తప్పనుంది. సూపర్ మార్కెట్ల తరహాలోనే ఈ మినీ మార్టులు ఉండనున్నాయి. ప్రజలకు అవసరమైన అన్నీ నాణ్యమైన నిత్యావసర సరుకులు వీటిల్లో అందుబాటులో ఉంటాయి. జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య సహకారంతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. కార్పొరేట్ రేంజ్లో వీటిని నెలకొల్పనున్నారు. తొలుత నగరాలు, పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు భారీగా ఉన్నాయి. దీంతో సామాన్యులపై అదనపు భారం పడుతుంది. పేదలకు నిత్యావసర సరుకుల ఖర్చును తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రేషన్ షాపుల్లో స్టీమ్ రైస్
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రేషన్ షాపుల్లో స్టీమ్ రైస్ కూడా పంపిణీ చేయనుంది. ఈ మేరకు కేంద్రం కూడా అంగీకరించింది. దీంతో త్వరలోనే వీటిని రేషన్ షాపుల్లో ప్రవేశపెట్టనున్నారు. నాణ్యమైన బియ్యంను అందించడం వల్ల రేషన్ సరఫరాలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. బియ్యంను ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలుత మధ్యాహ్న భోజన పథకం కోసం పైలట్ ప్రాజెక్టుగా స్టీమ్ రైస్ ఉపయోగించనున్నారు. అనంతరం రేషన్ షాపుల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక రేషన్ సరుకుల చెల్లింపుల కోసం డిజిటల్ రూపాయి వాలెట్ విధానాన్ని అమలు చేయనున్నారు. దీని ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన సరకులు కొనుగోలు చేసి చెల్లింపులు చేయవచ్చు. తొలుత విశాఖపట్నంలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నారు.
