Amaravati: రాజధాని పరిధిలో అదనంగా 20 వేల ఎకరాల సమీకరణ
ఏపీ రాజధాని అమరావతిలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నూతన కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో..16 సంస్థలకు 65 ఎకరాల మేర భూ కేటాయింపులకు ఆమోదం లభించింది. భూ కేటాయింపులు పొందిన సంస్థలు ఆరు నెలల్లో నిర్మాణాలు ప్రారంభించాల్సి ఉంటుంది.

మూడేళ్లలో అమరావతి సాకారం.. ఇదే లక్ష్యంగా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా మరో కీలక అడుగు వేసింది చంద్రబాబు సర్కారు. రాజధాని పరిధిలో అదనంగా 20 వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అథారిటీ ఆమోదం తెలిపింది. అమరావతి, తుళ్లూరు మండలాల్లోని ఏడు గ్రామాల్లో కలిపి మొత్తం 20 వేల 494 ఎకరాల భూమిని సమీకరించాలన్న ప్రతిపాదనకు అథారిటీ పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ ఆధిపత్యం ఉన్న ఒకటి, రెండు గ్రామాల్లో కొంత గందరగోళముందన్న మంత్రి నారాయణ.. 5, 10 శాతం ఆమోదం లభించకపోవడం సహజమేనని తేల్చిచెప్పారు.
హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్లు, అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్ఎఫ్పీ
మొత్తం 7 ప్రధాన అంశాలపై సీఆర్డీఏ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేశారు. ఇందులో భాగంగా దీంతో పాటు రాజధానిలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించేందుకు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మందడం, రాయపూడి, పిచుకలపాలెం వంటి ప్రాంతాల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్లు, అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఆర్ఎఫ్పీ పిలిచేందుకు అనుమతించారు. అమరావతిలో నిర్మించనున్న ఫైవ్స్టార్ హోటళ్లకు సమీపంలో నాలుగు చోట్ల కన్వెన్షన్ సెంటర్లను నిర్మించే ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది.
రాజధానిలో 2 వేల 500 ఎకరాల్లో స్మార్ట్ పరిశ్రమలు
రాజధాని అమరావతికి పరిశ్రమలు రావాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి నారాయణ. 2 వేల 500 ఎకరాల్లో స్మార్ట్ పరిశ్రమలు తీసుకువస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా చూసేందుకు ప్రకాశం బ్యారేజీ ఎగువన డీసిల్టేషన్ ప్రక్రియ ద్వారా ఇసుకను తవ్వుకునేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..