ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా.. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల హవా. కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో పేరాబత్తుల రాజశేఖరం ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించారు. మొత్తం తొమ్మిది రౌండ్లకు గానూ, ఏడో రౌండ్లోనే మేజిక్ ఫిగర్ దాటేశారు. మంగళవారం తెల్లవారుజామున 5:50 గంటల సమయంలో చివరి రౌండ్ పూర్తయ్యే సరికి 82,319 ఓట్ల ఆధిక్యత సంపాదించారు. ఇంకా రెండు రౌండ్లు మిగిలి ఉండగానే మేజిక్ ఫిగర్ దాటారు. 82,319 ఓట్ల మెజారిటీతో ఆలపాటి రాజా భారీ విజయం సాధించారు. ఆయనకు లక్షా 45 వేల 57 ఓట్లు పోలయ్యాయి. సమీప ప్రత్యర్థి PDF అభ్యర్థి లక్ష్మణరావుకు 62 వేల 737 ఓట్లు వచ్చాయి. మొత్తం 2 లక్షల 41 వేల 544 ఓట్లు పోలయ్యాయి. అందులో 26 వేల 676 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. ఆలపాటి విజయంతో కూటమి కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు
మరోవైపు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. ఇక్కడ మేజిక్ ఫిగర్ 10,068 ఓట్లు కాగా.. ఆయనకు 12,035 ఓట్లు వచ్చాయి. దాంతో ఆయన గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో మొదటి రౌండు పూర్తయ్యేసరికి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి ఆధిక్యత సంపాదించారు. దీంతో రెండు పట్టభద్రుల స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు సత్తాచాటారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా పూర్తయిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..