ఇంట్లో నిద్ర పోతున్న చిన్నారిని నోట కరచుకున్న చిరుత.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఇటీవల కాలంలో ప్రమాదకర అడవి మృగాలు జనావాసాల్లో సంచరిస్తున్నాయి. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అయ్యాయి. సాధారణఃగా ఇలాంటి ఘటనలు గిరిజన ప్రాంతాలు, అడవులు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో చోటు చేసుకునేవి. కానీ నేడు ఎక్కడపడితే అక్కడ వన్యమృగాలు దాడి చేస్తున్నాయి. తాజాగా అలాంటి మరో ఘటన వెలుగు చూసింది..

పెద్దదోర్నాల, ఆగస్ట్ 15: ఇటీవల కాలంలో వన్యప్రాణులు జనావాసాల్లోకి యదేచ్ఛగా ప్రవేశిస్తున్నాయి. పులులు, సింహాలతోపాటు నక్కలు వంటి ప్రమాదకర జంతువులు ఇళ్ల మధ్యలో సంచరిస్తున్నాయి. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అయ్యాయి. గతంలో ఇలాంటి ఘటనలు గిరిజన ప్రాంతాలు, అడవులు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో చోటు చేసుకునేవి. కానీ నేడు ఎక్కడపడితే అక్కడ వన్యమృగాలు దాడి చేస్తున్నాయి. తాజాగా అలాంటి మరో ఘటన వెలుగు చూసింది. రాత్రి పూట అందరూ నిద్రపోయాక ఓ చిరుత గుట్టుచప్పుడుకాకుండా ఓ ఇంట్లోకి ప్రవేశించింది. నేలపై తల్లిదండ్రుల మధ్య నిద్రపోతున్న మూదేళ్ల చిన్నారిని నోటికి కరచుకుని బయటకు ఉడాయించేందుకు యత్నించింది. అంతలో షాకింగ్ సీన్ చోటు చేసుకోవడంతో చిన్నారిని వదిలేసి అక్కడి నుంచి పరారైంది. ఈ షాకింగ్ ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకెళ్తే..
ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం చిన్నారుట్ల గూడేనికి చెందిన కుడుముల అంజయ్య, లింగేశ్వరి దండపతులకు మూడేళ్ల కుమార్తె అంజమ్మ సంతానం. వీరు బుధవారం రాత్రి తమ ఇంట్లో భోజనం చేసి, నేపలై నిద్రపోయారు. అయితే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగానీ అర్ధరాత్రి సమయంలో చిరుత వారి ఇంట్లోకి ప్రవేశించి. అనక నిద్రపోతున్న అంజమ్మ తలను నోట కర్చుకొని అడవిలోకి వెళ్లేందుకు పరుగుతీయబోయింది. ఇంతలో చిన్నారి పెద్దగా ఏడవటంతో.. తల్లిదండ్రులు నిద్రలేచి తమ ఎదురుగా ఉన్న జంతువును చూసి పరేషానయ్యారు.
దీంతో భయంతో గట్టిగా ఇద్దరూ కేకలు వేశారు. అంతే హడలిపోయిన చిరుత.. చిన్నారిని అక్కడే వదిలేసి పరారైంది. స్వల్ప గాయాలైన చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే శ్రీశైలం ప్రాజెక్టు వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించి, ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, పోలీసులు గురువారం ఉదయం చిన్నారుట్ల గూడేనికి చేరుకున్నారు. బాలికను పెద్దదోర్నాలలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, బాలిక మెడపై గాయాలకు కుట్లు వేశారు. బాలిక చికిత్సకు ఆమె తల్లిదండ్రులకు ఎస్సై మహేష్ కొంత ఆర్ధిక సాయం అందించారు. చిన్నారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తామని డీఎఫ్వో సందీప్ కృపాకర్ చెప్పారు. చిరుత కదలికలు కనిపెట్టేందుకు ఐదుగురు సిబ్బందితో పాటు 15 కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. చిరుత సంచారం నేపథ్యంలో చిన్నారుట్ల గూడెం వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గూడెంకి విద్యుత్ సదుపాయం లేకపోవడం వల్ల తరుచూ వన్యప్రాణులు దాడులు చేస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న డీఎఫ్వో త్వరలోనే విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




