Monkeys Attack: మనిషిని చంపిన కోతులు.. పొలంలో గేదెలు మేపేందుకు వెళ్లగా 20 కోతుల దాడి!
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామానికి చెందిన దానబోయిన చిన్నబుల్లి (65)కి మూడు ఎకరాల జీడి తోట ఉంది. గ్రామ శివారులోని తోటను అనుకుని ఉన్న ఇంట్లో కూతురు లక్ష్మితో కలసి జీవిస్తోంది. శనివారం సాయంత్రం చిన్నబుల్లి పొలంలో గేదెలు మేపడానికి వెళ్లింది..

కాకినాడ, మార్చి 22: కోతి మూకల గుంపు దాడిలో ఓ వృద్ధురాలు ప్రాణాలు విడిచింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామానికి చెందిన దానబోయిన చిన్నబుల్లి (65)కి మూడు ఎకరాల జీడి తోట ఉంది. గ్రామ శివారులోని తోటను అనుకుని ఉన్న ఇంట్లో కూతురు లక్ష్మితో కలసి జీవిస్తోంది. శనివారం సాయంత్రం చిన్నబుల్లి పొలంలో గేదెలు మేపడానికి వెళ్లింది. అక్కడ ఉన్న కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేయగా తీవ్ర గాయాలతో చిన్నబుల్లి అక్కడికక్కడే మృతి చెందింది.
గ్రామంలో కోతుల బెడద ఎక్కువైందని, వాటిని బంధించి ఇతర ప్రాంతాలకు తరలించాలని పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, అందువల్లే ఇప్పుడు నిండు ప్రాణం బలైందని గ్రామస్థులు ఆరోపించారు. సుమారు 20 కోతులకు పైగా దాడి చేయడంతో తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల కోతులు జనావాసాల్లోకి ప్రవేశించి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. అటవీ సంపద క్షీణిస్తుండటంతో కోతులు ఆహారం కోసం గ్రామాలపై పడుతున్నాయి. ఈ క్రమంలో అవి పంట పొలాలకు సైతం తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. అధికారులు అడవులను వృద్ధి చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం కానరావడం లేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




