టోల్ ఫీజు..! హర్మూజ్పై ట్రంప్ సంచలన ప్రకటన.. అబ్బో.. ’20 శాతం ఎక్కువే’ అంటూ ఇరాన్ కౌంటర్
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతూ గల్ఫ్ ప్రాంతాన్ని యుద్ధ వాతావరణంలోకి నెట్టుతున్నాయి. హర్మూజ్ జలసంధిపై ఆధిపత్య పోరు ముదురుతుండగా, అంతర్జాతీయ నౌకలకు భద్రత కల్పించే పేరుతో అమెరికా కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. దీనికి ప్రతిగా హర్మూజ్ జలసంధికి అసలైన సంరక్షకుడు ఇరాన్నే అంటూ టెహ్రాన్ తీవ్రంగా స్పందించింది.

అమెరికా, ఇరాన్ మిస్సైల్ దాడులతో గల్ఫ్ రీజియన్ దద్దరిల్లిపోతోంది. అంతేకాకుండా.. హర్మూజ్ జలసంధిపై అమెరికా-ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమవుతోంది. హర్మూజ్ జలసంధిని మూసేశామన్న ఇరాన్ ప్రకటనకు ట్రంప్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆ మార్గంలో వెళ్లే అంతర్జాతీయ నౌకలపై టోల్ ఫీజు వసూలు చేస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. అయితే 60 రోజుల శాంతి గడువు ముగుస్తున్నా.. ఇరు దేశాలు తగ్గకపోవడంతో గల్ఫ్ రీజియన్లో యుద్ధం తారాస్థాయికి చేరింది.. ముఖ్యంగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటనతో హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యపోరు మొదలైంది. ఆ మార్గంలో ప్రయాణించే వాణిజ్య నౌకలకు భద్రత కల్పించే బాధ్యత తమదేనని పేర్కొంటూ, అందుకు ప్రతిఫలంగా రుసుము వసూలు చేసే ప్రతిపాదనను ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయానికి సంబంధించి అమలు ప్రక్రియను తక్షణమే ప్రారంభిస్తామని కూడా వెల్లడించారు.
దీనికి ప్రతిస్పందించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ… హర్మూజ్కు అసలైన సంరక్షకుడు ఇరాన్నే అని పేర్కొంటూ అమెరికా వాదనను తిరస్కరించారు. తాము 20శాతం వసూలు చేయమని, తక్కువ ఫీజే తీసుకుంటామంటూ ఇరాన్ అమెరికాకు కౌంటర్ ఇచ్చింది.
ఇరాన్ లక్ష్యంగా అమెరికా..
మరోవైపు, ఇరాన్ లక్ష్యంగా అమెరికా వరుసగా మూడో రోజు సైనిక దాడులు కొనసాగించింది. హర్మూజ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు జరగకుండా నిరోధించడమే తమ చర్యల ఉద్దేశమని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇరాన్ దాడి సామర్థ్యాన్ని బలహీనపరిచే ఆపరేషన్లు కొనసాగుతాయని ప్రకటించగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చర్యలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతాయని వ్యాఖ్యానించారు. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇరాన్ దాడులు..
ఇదిలాఉంటే.. నిన్న గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలే టార్గెట్గా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ భీకర దాడులకు తెగబడింది. కువైట్లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడి.. అక్కడి ఇంధన ట్యాంకులను, అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను, ఎఫ్పీఎస్ రాడార్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది ఇరాన్. అటు అమెరికా 5వ ఫ్లీట్ కేంద్రమైన బహ్రెయిన్పై కూడా ఒకే రోజు మూడుసార్లు క్షిపణి దాడులు చేయడంతో అక్కడ యుద్ధ సైరన్లు మోగాయి. జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.
భారతీయ సిబ్బంది ఒకరు మృతి..
హర్మూజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన రెండు చమురు ట్యాంకర్లపై జరిగిన క్షిపణి దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఒక భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, పలువురు విదేశీ నావికులు గాయపడ్డారు. మంటలు చెలరేగినప్పటికీ అత్యవసర చర్యలతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనను అంతర్జాతీయ సముద్ర భద్రతకు ముప్పుగా అభివర్ణించిన యూఏఈ… తమ సార్వభౌమాధికారాన్ని, జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
