Suez Canal: కెనాల్‌లో ఒక్క నౌకే కదా చిక్కుకుందనుకుంటున్నారా? దాని వెనుక పెద్ద కథే వుంది..!

Suez Canal blocked by a huge ship: ఐరోపా, ఆసియా ఖండాల సముద్ర మార్గాన్ని సులభతరం చేసిన సూయజ్ కాల్వ (కెనాల్)లో భారీ షిప్ చిక్కుకుపోవడం ఇపుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద వార్త.

Suez Canal: కెనాల్‌లో ఒక్క నౌకే కదా చిక్కుకుందనుకుంటున్నారా? దాని వెనుక పెద్ద కథే వుంది..!
Suez
Follow us

|

Updated on: Mar 25, 2021 | 7:17 PM

Suez Canal blocked by a huge ship: ఐరోపా, ఆసియా ఖండాల సముద్ర మార్గాన్ని సులభతరం చేసిన సూయజ్ కాల్వ (కెనాల్)లో భారీ షిప్ చిక్కుకుపోవడం ఇపుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద వార్త. ఓ కెనాల్‌లో షిప్ ఇరుక్కుంటే అంత పెద్ద వార్త ఎలా అయి కూర్చుందనుకుంటున్నారా? ఆ నౌక సైజ్ ఓ మూడు ఫుట్ బాల్ గ్రౌండ్లను కలిపితే ఎంత వుంటుందో ఆ సైజ్ అన్నమాట. అయినా.. సరే నింపాదిగా ఆ షిప్పును బయటికి తీసి పాడేయొచ్చు.. పెద్ద కథేముందనుకుంటున్నారా? అదీ తప్పే. ఎందుకంటే సూయజ్ కెనాల్ ఇంపార్టెన్స్ తెలిసిన వారెవరు అలా అనుకోరు. ఇంతకీ సూయజ్ కాల్వ ప్రాధాన్యత.. ఇపుడు ఎదురైన సమస్య ఏంటంటే.. ??

గురువారం పత్రికలను చూసిన వారంతా గమనించిన వార్త.. సూయజ్ కాలువలో అడ్డం తిరిగిన భారీ నౌక. సింపుల్‌గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ కాల్వలో భారీ షిప్పు ఇరుక్కుపోవడంతో గంటకు ఏకంగా 3 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. అగ్ర రాజ్యం అమెరికా సహా పలు దేశాలు ఇబ్బందుల పాలవబోతున్నాయి. యూరప్, ఆసియా ఖండాల్లోని దేశాల మధ్య జల రవాణా కోసం నిర్మించిన ఈ కెనాల్ కారణంగా ఎన్నో దేశాల సముద్ర రవాణా కొనసాగుతోంది. అమెరికాకు, గల్ఫ్ దేశాలకు మధ్య వారధిగా ఈ కెనాల్ నిలుస్తోంది. గతంలో రెండు (యూరప్, ఆసియా) ఖండాల మధ్య రవాణాకోసం ఆఫ్రికా ఖండాన్ని మొత్తం చుట్టి రావాల్సి వచ్చేది. దాంతో సూయజ్ కెనాల్ ప్రతిపాదన తెరమీదికి వచ్చింది. 1869లో ఈజిఫ్టులో సూయజ్ కాలువ నిర్మాణం మొదలైంది. యూరప్, ఆసియా దేశాల మధ్య ప్రయాణ దూరం గణనీయంగా తగ్గింది. ప్రయాణ భారం కూడా చాలా తగ్గిపోయింది.

మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం మధ్య వారధిలాగా పనిచేస్తోంది సూయజ్ కెనాల్. ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రం, నార్తర్న్ హిందూ మహా సముద్రం మధ్య నేరుగా ప్రయాణానికి వీలు కలిగింది ఈ కెనాల్ నిర్మాణం తర్వాత. ఈ కాలువ లేకుంటే అరేబియన్ సముద్రం నుంచి లండన్ సముద్ర మార్గం ద్వారా వెళ్లాలంటే.. దక్షిణ అట్లాంటిక్, దక్షిణ హిందూ మహా సముద్రం ద్వారా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. సూయజ్ కాలువ నిర్మాణంతో ఆ రెండు ఖండాల మధ్య ప్రయాణ దూరం ఏకంగా 8,900 కి.మీ.లు తగ్గిపోయింది. 120 మైళ్ల పొడవు ఉండే సూయజ్ కెనాల్ ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే జలమార్గం. అలాంటి చోట్ల భారీ నౌక ఇరుక్కుపోవడంతో ప్రపంచ వ్యాపారంపై ప్రభావం పడుతోంది. అరబ్ దేశాల నుంచి చమురు వెళ్ళాలంటే ఇదే సరైన మార్గం. గల్ఫ్ దేశాల నుంచి అమెరికాకు సముద్రయానం, సరుకు రవాణాకు ఇదే మార్గాన్ని వాడతారు. చైనా-నెదర్లాండ్స్‌ మధ్య జరిగే సరుకు రవాణాకు సూయజ్ కెనాలే ముఖ్య మార్గం.

ప్రస్తుతం సూయజ్ కాలువలో అల్ట్రా లార్జ్‌ కంటెయినర్‌ షిప్‌ ఇరుక్కుపోయింది. పెను గాలులతో పక్కకు తప్పుకున్నది ఎవర్‌ గ్రీన్‌ నౌక. ఒక్కసారిగా కెనాల్‌పై అడ్డంగా తిరిగి ఆగిపోయింది ఈ షిప్పు. నౌకను తిరిగి యథాస్థితికి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాలువపై ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ఆ మార్గానికి రెండు వైపులా ఎన్నో సరకు రవాణా ఓడలు ఆగిపోయాయి. ఈ ఎవర్ గ్రీన్ షిప్‌ను తైవాన్‌లో తయారు చేశారు. పనామాలో రిజిస్టర్‌ చేశారు. ఆ నౌకలో వందలాదిగా కంటెయినర్‌లున్నాయి. కాగా.. సూయజ్ కాల్వ ద్వారా ప్రపంచ వాణిజ్యంలో ప్రతి ఏటా సుమారు 12 శాతం వ్యాపారం ఈ కెనాల్ ద్వారానే సాగుతుంది. 8 శాతం సహజ వాయువు ఈ కాలువ ద్వారా వివిధ దేశాలకు రవాణా అవుతుంది. ప్రతిరోజూ పది లక్షల బ్యారెల్స్‌ ఆయిల్‌ సరఫరా ఈ కెనాల్ ద్వారా కొనసాగుతుంది. ప్రస్తుతం షిప్ చిక్కుకున్న‌ కారణంగా గంటకు సుమారు 3వేల కోట్ల రూపాయల మేర నష్టం జరిగే అవకాశం వుందని అంఛనా వేస్తున్నారు.

చిక్కుకున్న నౌక ఎంతంటే…

ప్రస్తుతం సూయజ్ కెనాల్‌లో చిక్కుకుపోయిన ఎవర్ గ్రీన్ నౌక ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్‌ నౌక. 400 మీటర్ల పొడవు.. దాదాపు 60 మీటర్ల వెడల్పు గలదీ నౌక. ఈ నౌకకు 20వేల కంటైనర్ల వరకు మోసుకెళ్లే సామర్ధ్యం ఉన్నది. ఈ నౌక బరువు 2.24 లక్షల టన్నులు. ఇంత పెద్ద నౌక సూయజ్‌ కాలువలో అడ్డంగా నిలిచిపోవడంతో తిప్పలు తీవ్రమయ్యాయి. భారీ సంఖ్యలో ఇరువైపులా కంటైనర్‌ నౌకలు, చమురు ట్యాంకర్లు ఆగిపోయాయి. ఇక్కడ రవాణా నిలిచిపోతే.. చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదం వుంది. రెండు రోజుల్లోనే బ్రెంట్‌ క్రూడ్‌ ధర 2.9 శాతం పెరిగిందంటే ఈ కెనాల్ ద్వారా రవాణా అయ్యే చమురు ఏ మాత్రం తగ్గినా దాని ప్రభావం ప్రపంచ క్రూడ్ ఆయిల్ మార్కెట్ పైన ఏ స్థాయిలో వుంటుందో అంఛనా వేయొచ్చు. సూయజ్‌ కాలువ ముఖ ద్వారానికి దక్షిణం వైపు నుంచి ఉత్తరానికి 6 కి.మీ. దూరంలో ప్రస్తుతం ఎవర్ గ్రీన్ నౌక చిక్కుకుపోయింది.

ఎవర్‌ గ్రీన్‌ నౌక వెనక ఉన్న మేరస్క్‌ డెన్వర్‌ అనే ఓడలో ప్రయాణం చేస్తున్న జూలియన్‌ కోనా అనే మహిళ సూయజ్ కాల్వలో చిక్కుకుపోయిన షిప్ ఫోటోను షేర్ చేసింది. తమ ముందున్న నౌక కాలువకు అడ్డం తిరిగిందంటూ కోనా ఆ ఫోటోకు కొటేషన్ ఇచ్చింది. నిజానికి గతంలోను ఇలాంటి ఉదంతాలు కొన్ని జరిగాయి. కానీ ఆయా సందర్బాలలో కేవలం కొన్ని గంటల్లోనే షిప్పులను క్లియర్ చేయడం వీలైంది. కానీ ప్రస్తుతం ఇరుక్కుపోయిన షిప్పు భారీ సైజుది కావడంతో దాన్ని తొలగించి, మార్గాన్ని క్లియర్ చేయడం అంత సులభసాధ్యం కావడం లేదు. దాంతో రెండు రోజులవుతున్నా అడ్డంకి తొలగడం లేదు. ఎవర్‌ గ్రీన్‌ను  కదిలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టగ్‌ బోట్లు, డిగ్గర్ నిర్విరామంగా పని చేస్తున్నాయి. అయినా గానీ.. నౌకను దారిలో తెచ్చేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం వుందని తెలుస్తోంది. ఆందోళన సంకేతాన్ని ఈజిప్టులోని కెనాల్‌ నిర్వాహకులు విడుదల చేశారు.

ఎవర్ గ్రీన్ షిప్పు కారణంగా సూయజ్ కెనాల్ మార్గంలో సౌదీ, రష్యన్, ఒమన్, యు.ఎస్‌. ఇంధన ట్యాంకర్‌ ఓడలు నిలిచిపోయాయి. వాటికి ముందుకు కదలడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ప్రతీ రోజూ ఈ మార్గంలో కనీసం 50 నౌకలు ప్రయాణిస్తూ వుంటాయి. ప్రస్తుతం చిన్న, పెద్ద కలిపి వందకుపైగా నౌకలు సూయజ్ కాల్వ చేరువలో నిలిచిపోయాయి. ఈ మార్గాన్ని వదిలేసి.. వేరే మార్గంలో వెళితే.. ఎంతో సమయం వృధా అవడంతోపాటు.. ప్రయాణ భారం నాలుగింతలవుతుంది. ఒక్కో నౌక ఈ కెనాల్‌ను దాటేందుకు 11 నుంచి 18 గంటల సమయాన్ని తీసుకుంటాయి. కాలువ సామర్థ్యాన్ని పెంచేందుకు కొన్నేళ్ళ క్రితం ఓ బైపాస్‌ను నిర్మించారు. కానీ ప్రస్తుతం నౌక బైపాస్‌కు ఇవతల వైపు చిక్కుకుపోవడంతో సమస్య మొదలైంది. నిలిచిపోయిన ఇతర షిప్పులను తరలించేందుకు బైపాస్‌ను వాడుకోలేని పరిస్థితి నెలకొంది.

సూయజ్‌ కాల్వకు ప్రత్యామ్నాయంగా కోప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ మార్గంలో నౌకలు ప్రయాణించే వీలున్నా.. అదనంగా ఏడు వేల కిలో మీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది. కనీసం 14 రోజుల పాటు సముద్ర ప్రయాణం చేయాల్సి వుంటుందని అంఛనా వేస్తున్నారు. దాంతో సరుకు రవాణాకు అయ్యే ఖర్చు భారీగా పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సూయజ్‌ కెనాల్లో నౌకాయానం నిలిపి వేయడం గత 20 ఏళ్లలో ఇది మూడోసారి. 2004లో సూయజ్ కాలువలో ట్రోపిక్‌ బ్రిలియన్స్‌ అనే నౌక చిక్కుకుపోవడంతో మూడు రోజుల పాటు కాల్వను మూసివేశారు. 2017లో జపాన్‌కు చెందిన నౌక ఇరుక్కుపోయింది. దాంతో కొన్ని గంటలపాటు కెనాల్‌లో షిప్పుల రాకపోకలను నిలిపివేశారు.

సూయజ్ కెనాల్ హైలైట్స్ ఇవే..

సూయజ్‌ కాలువ (కెనాల్) (కృత్రిమ జలమార్గం) ఈజిప్టు వుంది. సూయజ్ కాలువ పొడవు…193.3 కి.మీ. లోతు 78 అడుగులు. కాలువ వెడల్పు నీళ్ల అడుగున 21 మీటర్లు కాగా.. కాలువ ఉపరితలంపై 60 నుంచి 90 అడుగులు వుంటుంది. మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రం వరకు ఈ కెనాల్ వుంటుంది. సూయెజ్‌ భూసంధిపై (జలాల మధ్య భూమార్గం) ఈ కెనాల్ నిర్మాణం జరిగింది.

# బయల్దేరే రేవు: పోర్ట్‌ సయెద్‌ (మధ్యధరా తీరం వెంబడి ఈశాన్య ఈజిప్టు) # చేరుకునే రేవు: పోర్ట్‌ ట్యూఫిక్‌ (ఎర్ర సముద్రపు పాయను ఆనుకుని ఈశాన్య ఈజిప్టు) # కాలువ నిర్మాణం ప్రారంభించిన తేది: 25-9-1859 # కాలువ నిర్మాణం పూర్తయిన తేది: 17-11-1869 # మొత్తం నిర్మాణానికి పట్టిన సమయం: 10 సంవత్సరాల 53 రోజులు # నిర్వహణ: ఈజిప్టుకు చెందిన సూయజ్ కెనాల్ అథారిటీ (ఎస్సీఏ) # 77.5 మీటర్ల వెడల్పు (254 అడుగులు, 3 అంగుళాలు) ఉన్న భారీ నౌకలు ప్రయాణించడానికి వీలు # కెనాల్‌ ఉపయోగం: ఆసియా, ఐరోపాల మధ్య షిప్పింగ్‌కి దగ్గరి దారి # నౌక ప్రయాణ సమయం: వేగాన్ని బట్టి 11 నుంచి 18 గంటలు # నౌక ప్రయాణ వేగం: గంటలకు 15 కి.మీ. (8 నాటికల్‌ కి.మీ) # గతేడాది ఈ మార్గంలో ప్రయాణించిన మొత్తం నౌకలు: 19,000 # రోజుకు సగటున 51 కంటే ఎక్కువ నౌకలు ప్రయాణం చేస్తాయి. # సూయజ్‌ కెనాల్‌ అథారిటీ లెక్కల ప్రకారం.. ఈ మార్గంలో ప్రయాణించినందుకు నౌకల నుంచి వసూలు చేసిన టోలు గతేడాది 6 బిలియన్‌ డాలర్లు (రూ.43.5 వేల కోట్లు)

ALSO READ: ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ పేరు.. ఇంతకీ ఆపేరే ఎందుకు?