
బ్రిటన్ ప్రధాని రేసులో రుషి సునాక్ వర్సెస్ బోరిస్ జాన్సన్ సీన్ మళ్లీ ఖాయమనిపిస్తోంది. ఓవైపు 100 మంది ఎంపీల మద్దతుతో స్పష్టమైన ఆధిక్యతతో ముందుకు దూసుకెళ్తున్నారు రుషి సునాక్. మరోవైపు ప్రధాని పదవి దక్కించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు బోరిస్ జాన్సన్. అయితే, బ్రిటన్ ప్రధాని రేసులో మరోసారి దూసుకుపోతున్నారు భారత సంతతికి చెందిన రిషీ సునాక్. బ్రిటన్ మాజీ ఆర్ధికమంత్రిగా పనిచేసిన రిషి సనాక్కు కన్జర్వేటివ్ ఎంపీల మద్దతు క్రమంగా పెరుగుతోంది. 100 మందికి పైగా ఎంపీలు ఇప్పటి వరకు మద్దతు ప్రకటించారు. కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు అధికార కన్జర్వేటివ్ పార్టీ కసరత్తు చేస్తోంది.
కొత్త నిబంధనల ప్రకారం.. కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవికీ, ప్రధానమంత్రి పదవికి పోటీ చేసే అభ్యర్థులకు కనీసం 100 మంది పార్టీ ఎంపీల మద్దతు ఉండాలి. ఈ క్రమంలోనే సునాక్కు వంద మంది ఎంపీలు మద్దతిస్తున్నారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ప్రధాని పదవికి సునాక్ చేయడం ఖాయమని వాళ్లంటున్నారు. అయితే, దీనిపై సునాక్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ప్రధాని పదవి నుంచి కొద్దిరోజుల క్రితమే తప్పుకున్న బోరిస్ జాన్సన్ మళ్లీ అదే పదవి కోసం జోరుగా లాబీయింగ్ మొదలుపెట్టారు. తన భార్యాపిల్లలతో ప్రస్తుతం విహారయాత్రలో ఉన్న జాన్సన్.. హుటాహుటిన యూకే చేరుకున్నారు. రుషి సునాక్కు ఫోన్ చేసి తనకు మద్దతు ఇవ్వాలని బోరిస్ జాన్సన్ కోరినట్టు తెలుస్తోంది. తనను ప్రధాని చేస్తే కన్జర్వేటివ్ పార్టీని మళ్లీ అధికారం లోకి తీసుకొస్తానని ప్రచారం చేస్తున్నారు జాన్సన్. ఇప్పటివరకు 45 మంది ఎంపీలు జాన్సన్కు మద్దతు ఉండగా.. సోమవారానికి ఈ సంఖ్య 100కు చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్ ప్రధాని రేసులో రుషి సునాక్ , బోరిస్ జాన్సన్లు మళ్లీ తలపడే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఆదివారం లోగా ఇద్దరు నేతలు పోటీపై అధికార ప్రకటన చేసే అవకాశం ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..