
అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం మరోసారి పొరుగు దేశాల వైపు చేతులు చాస్తోంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తన 3.5 బిలియన్ డాలర్ల రుణాన్ని వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఇస్లామాబాద్పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో పొరుగు దేశాల సాయం కోరుతూ పరుగులు పెడుతోంది పాకిస్థాన్.
బ్లూమ్బెర్గ్ కథనం ప్రకారం, ఈ నెలలోనే యూఏఈకి బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒకవేళ ఈ మొత్తాన్ని చెల్లిస్తే, పాకిస్థాన్ విదేశీ మారక నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోతాయి. మార్చి 27 నాటికి పాకిస్థాన్ వద్ద కేవలం 16 బిలియన్ డాలర్ల నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇవి కేవలం మూడు నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. ఈ గడ్డు పరిస్థితి నుండి బయటపడటానికి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇప్పుడు చైనా, సౌదీ అరేబియాలతో అత్యవసర రుణ చర్చలు జరుపుతోంది.
అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరించడం ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు పొందాలని షాబాజ్ షరీఫ్ భావిస్తున్న తరుణంలో ఈ ఆర్థిక ఎదురుదెబ్బ తగిలింది. ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య, ముఖ్యంగా ఇరాన్ తన పొరుగు దేశాలపై క్షిపణి దాడులు చేసిన నేపథ్యంలో, యూఏఈ తన నిధులను వెనక్కి కోరడం గమనార్హం. వాషింగ్టన్లో ఐఎంఎఫ్ (IMF), ప్రపంచ బ్యాంకు సమావేశాలకు హాజరైన పాకిస్థాన్ ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబు, దేశ ఆర్థిక స్థితిపై ఆశాజనకంగా స్పందించారు. “ఫిబ్రవరిలో ఇరాన్పై దాడులు జరగకముందు మా నిల్వలు బలంగా ఉండేవి. ప్రస్తుతం నాలుగేళ్ల విరామం తర్వాత మళ్ళీ యూరో బాండ్లను జారీ చేయడం ద్వారా ప్రపంచ బాండ్ మార్కెట్లోకి ప్రవేశించాలని చూస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు.
ఐఎంఎఫ్ నుంచి అందబోయే 7 బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీలో ఒక విడత నిధుల కోసం పాకిస్థాన్ వేచి చూస్తోంది. ప్రస్తుతానికి చమురు సంక్షోభం ఉన్నప్పటికీ, ఐఎంఎఫ్ కార్యక్రమాన్ని పొడిగించాలని కోరడం లేదని, పరిస్థితి మరింత దిగజారితేనే అదనపు చర్చలు జరుపుతామని ఔరంగజేబు స్పష్టం చేశారు. అప్పులు తీర్చడానికి మరిన్ని అప్పులు చేయక తప్పని స్థితిలో పాకిస్థాన్ కొట్టుమిట్టాడుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..