వరదలు పోటెత్తుతాయని 5 నెలల ముందే తెలుసా? విదేశీ సహాయక బృందాలకు అనుమతి!
నేపాల్ లో కొట్టుకుపోయిన ఏడు మృతదేహాలు ఉత్తరప్రదేశ్లో ప్రత్యక్షమయ్యాయి. హిమాలయాల్లో వేగంగా మంచు కరుగుతోందని 2026 మార్చిలో రెండు నివేదికలు హెచ్చరించాయి. సహాయక చర్యల కోసం భారత్, అమెరికా, చైనా సహాయక బృందాల అవసరం తమకు లేదని, విరాళాలు ఇస్తే చాలన్న నేపాల్ తాజాగా యూటర్న్ తీసుకుని విదేశీ బృందాలను ఆహ్వానించింది. ఆ వివరాలను చూద్దాం.

ఆగస్టు 26న నేపాల్- టిబెట్ సరిహద్దు జిల్లాలపై జల ప్రళయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పది అంతస్తుల ఎత్తులో భయానకంగా విరుచుకుపడిన సునామీ రాకాసి అల ఊళ్లకు ఊళ్లను మాయం చేసింది. ప్రకృతి ప్రకోపంతో నేపాల్ భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని చవిచూసింది. ఇప్పటివరకు 547 మంది మరణించగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వరదల్లో దాదాపు 1600 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 288 మంది భారతీయులు ఉన్నారు. నేపాల్ లో 2013 భూకంపం తర్వాత మరోసారి ఆ స్థాయిలో విధ్వంసం జరిగింది.
నేపాల్ లో కొట్టుకుపోయిన మృతదేహాలు యూపీలో ప్రత్యక్షం!
ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో నేపాల్ లో కొట్టుకుపోయిన ఏడు మృతదేహాలు ఉత్తరప్రదేశ్లో ప్రత్యక్షం కావడం అధికారులను షాక్ కు గురి చేసింది. నేపాల్లోని చిత్వాన్ ప్రాంతానికి సరిహద్దుగా యూపీలోని మహారాజ్ గంజ్, కుషినగర్ జిల్లాలున్నాయి. వాటి నదుల్లో నీటిపై తేలుతూ మృతదేహాలు కనిపించాయి. మహారాజ్ గంజ్ జిల్లా పరిధిలో నాలుగు, కుషినగర్ జిల్లా పరిధిలోని నదీ తీరాల్లో మూడు మృతదేహాలను స్థానిక అధికారులు బయటకుతీసారు. టిబెట్ నుంచి భోటేకోశి నది నేపాల్ లోకి ప్రవేశించి త్రిశూలి నదిలో కలుస్తుంది. ఆ తర్వాత దేవఘాట్ వద్ద గండకీ నదితో కలిసి ‘గండకీ’గా మారి భారత్ లో ప్రవహించి గంగానదిలో కలుస్తుంది. ఈ నదీ ప్రవాహ మార్గం ద్వారా మృతదేహాలు భారత భూభాగంలోకి కొట్టుకొచ్చాయని అధికారులు తెలిపారు. అవి పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో వాటిని జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. ప్రస్తుతం మృతదేహాలను గుర్తించేందుకు నేపాల్ అధికారులతో సమన్వయం చేస్తున్నారు. అయితే నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గంగా, గండక్, కోసి, బుర్హీ గండక్, ఘాఘ్రా నదులలో నీటిమట్టాలు పెరిగాయి. బిహార్లో చాలా చోట్ల ఈ నదులు ప్రమాదస్థాయిని దాటాయి. దాంతో యూపీ, బిహార్ బార్డర్ జిల్లాల్లో అధికారులు నదుల నీటిమట్టాలను మానిటర్ చేస్తూ రక్షణ బృందాలను అప్రమత్తం చేశారు.
నేపాల్లో వరదలు పోటెత్తుతాయని 5 నెలల ముందే తెలుసా?
2026 మార్చిలో ప్రచురితమైన రెండు వాతావరణ నివేదికలు, హిమాలయ పర్వతసానువుల్లో వేగంగా మారుతున్న పరిస్థితులను బయటపెట్టాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా హిమానీనదాలు వేగంగా కరుగుతున్నాయని రెండు నివేదికలు హెచ్చరించాయి. నేపాల్లో తాజాగా సంభవించిన ప్రాణాంతక వరదల తరువాత ఆ నివేదికలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆ విషయం తెలిసిన ప్రభుత్వాలు ఒక వేళ అప్రమత్తమై ప్రజలను సురకిత ప్రాంతాలకు తరలించి ఉంటే ఈ వైపరీత్యం జరిగి ఉండేది కాదని విమర్శలు వస్తున్నాయి.
నేపాల్ యూటర్న్ .. విదేశీ సహాయక బృందాలకు అనుమతి!
సహాయక చర్యల కోసం భారత్, అమెరికా, చైనా సహాయక బృందాల అవసరం తమకు లేదని, విరాళాలు ఇస్తే చాలనీ చెప్పిన నేపాల్ తాజాగా యూటర్న్ తీసుకుంది. ప్రమాద తీవ్రత అధికం కావడంతో కేవలం నేపాలీ సహాయక బృందాలతో సహాయక చర్యలు చేపట్టడం సాధ్యం కాదని భావించి మనసు మార్చుకుని విదేశీ బృందాల రాకకు అనుమతి ఇచ్చింది.
భారత్, చైనా, అమెరికా సహా ఇతర దేశాలు తమ రెస్క్యూ టీమ్స్ ను పంపేందుకు ముందుకొచ్చాయి. నేపాల్ ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించింది. గాలింపు, రెస్క్యూ ఆపరేషన్ల కోసం విదేశీ బృందాలను అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. విపత్తును మేనేజ్ చేసే పూర్తి సామర్థ్యం తమకు ఉందనీ అయితే సహాయక సామగ్రి, ఆర్థిక విరాళాలను మాత్రం స్వీకరిస్తామని తెలిపింది. పొరుగు దేశానికి ప్రాధాన్యత ఇస్తూ భారత్ ఇప్పటికే ఆరు వందల టన్నుల సామగ్రి, బెయిలీ వంతెనల్నినేపాల్ కు తరలించింది. 2015 భూకంపం సమయంలో విదేశీ బృందాలు రావడంతో నేపాల్ లో సమన్వయ సమస్యలు తలెత్తాయి. దాంతో విదేశీ సహాయక బృందాలను తిరస్కరించింది అక్కడి ప్రభుత్వం . అలాగే, తమకు సాయం పూర్తిగా వద్దని కాదనీ, తమ సెక్యూరిటీ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉందనీ ప్రస్తుతం బాగా పని చేస్తోందనీ నేపాల్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లోక్ బహదూర్ ఛెత్రి క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ నేపాల్కు ఏదైనా ప్రత్యేక సహాయం లేదా టెక్నాలజీ కావాలసి వస్తే అప్పుడు అడుగుతామన్నారు. నేపాల్ విజ్ఞప్తి మేరకు అదనపు సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి