AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేపాల్‌ను వెంటాడుతున్న మరో వరద భయం.. భోటేకోషిలో మళ్లీ పెరుగుతున్న నీటిమట్టం!

నేపాల్‌ను మరో భారీ వరద భయం వెంటాడుతోంది. ఇప్పటికే భోటేకోషి నదిలో సంభవించిన వరదల విధ్వంసం నుంచి తేరుకోకముందే, నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. టిబెట్ వైపు ఏర్పడిన 'డెబ్రిస్-డ్యామ్‌డ్ లేక్' కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ కొత్త ముప్పుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నా, వాతావరణ పరిస్థితులు ఆటంకం కలిగిస్తున్నాయి.

నేపాల్‌ను వెంటాడుతున్న మరో వరద భయం.. భోటేకోషిలో మళ్లీ పెరుగుతున్న నీటిమట్టం!
Bhote Koshi River Water Rises
Balaraju Goud
|

Updated on: Aug 31, 2026 | 9:30 AM

Share

నేపాల్‌ను వెంటాడుతున్న మరో వరద ముప్పు..!

నేపాల్‌ను భారీ వరదల విషాదం నుంచి తేరుకోకముందే మరో ముప్పు భయపెడుతోంది. ఆగస్టు 26న టిబెట్ సరిహద్దులో హిమనదం, రాళ్లు, మంచు భారీగా కూలిపోవడంతో భోటేకోషి నదిలో సంభవించిన ఆకస్మిక వరదలు రసువా, నువాకోట్, ధాడింగ్ సహా పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ఈ విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. ఆగస్టు 31 నాటికి నేపాల్‌లో మరణాల సంఖ్య 700 దాటినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. వేలాది మంది కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అయితే అసలు ఆందోళన ఇప్పుడు కొత్తగా ఏర్పడిన నీటి ముప్పుపైనే ఉంది. భోటేకోషి నదిలో నీటిమట్టం మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ అధికారులు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. గత వరదలతో ఇప్పటికే రోడ్లు, వంతెనలు, విద్యుత్ మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితిలో మరో భారీ ప్రవాహం వస్తే నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు టిబెట్ వైపు ఏర్పడిన డెబ్రిస్-డ్యామ్‌డ్ లేక్‌పై కూడా నిఘా కొనసాగుతోంది. హిమనదం కూలిపోవడంతో నదికి అడ్డంగా భారీగా మట్టి, రాళ్లు, మంచు పేరుకుపోయి నీటి నిల్వ ఏర్పడింది. ఈ సరస్సులోకి మరింత నీరు చేరితే కట్ట తెగి దిగువ ప్రాంతాలకు ఒక్కసారిగా భారీ ప్రవాహం వచ్చే ప్రమాదం ఉందని నేపాల్, చైనా అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. సెప్టెంబర్ ప్రారంభం వరకు ఈ ముప్పును అత్యంత సీరియస్‌గా పరిగణిస్తున్నారు.

ఇదిలా ఉంటే సహాయక చర్యలు ఆరో రోజుకు చేరుకున్నాయి. రసువా, నువాకోట్ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తాజాగా 3,000 మందికి పైగా ప్రజలను రక్షించినట్లు నేపాల్‌ నుంచి వచ్చిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు శిథిలాలు, బురద, తెగిపోయిన రహదారులు, వంతెనలు, ప్రతికూల వాతావరణం కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.

ఇప్పటికే వరదల్లో గల్లంతైన వారి కుటుంబాలు ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లు, నదీ తీరాల వెంట తమ బంధువుల కోసం వెతుకుతున్నారు. గుర్తుతెలియని మృతదేహాలను గుర్తించేందుకు DNA నమూనాలు సేకరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మృతదేహాల సంఖ్య పెరుగుతుండటంతో వాటిని భద్రపరచడం, గుర్తించడం కూడా అధికారులకు పెద్ద సవాలుగా మారింది.

మరోవైపు నేపాల్‌లో సోమవారం కూడా పలు ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం కొనసాగుతోంది. కోషి, బాగ్మతి, లుంబినీ ప్రావిన్సుల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో వర్షాలు కొనసాగితే ఇప్పటికే వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

మొత్తంగా చూస్తే.. ఒకవైపు భారీ వరదల విధ్వంసం, మరోవైపు గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు.. ఇంకోవైపు భోటేకోషి నదిలో మళ్లీ పెరుగుతున్న నీటిమట్టం, టిబెట్‌లోని నీటి నిల్వపై పొంచి ఉన్న ముప్పు.. ఈ మూడు పరిణామాలు నేపాల్‌లో ఆందోళనను మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో మరో భారీ ప్రవాహం సంభవించకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రాబోయే కొన్ని రోజులు నేపాల్‌కు అత్యంత కీలకంగా మారాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లి్క్ చేయండి..

Follow Us