Russo-Ukrainian War: రష్యాకు ఉక్రెయిన్ షాక్.. మాస్కో సైనికుల లక్ష్యంగా దాడులు.. ఒక్కరోజులోనే..
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ఇప్పట్లో తెరపడుతుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తన లక్ష్యాన్ని నెరవేర్చుకోడానికి ఎంతకైనా సిద్ధపడుతోంది రష్యా. మరోవైపు శక్తిమేరకు పోరాడాలని, రష్యాకు లొంగకూడదనే ఉద్దేశంలో..
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ఇప్పట్లో తెరపడుతుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తన లక్ష్యాన్ని నెరవేర్చుకోడానికి ఎంతకైనా సిద్ధపడుతోంది రష్యా. మరోవైపు శక్తిమేరకు పోరాడాలని, రష్యాకు లొంగకూడదనే ఉద్దేశంలో ఉక్రెయిన్ ఉంది. తమ భూభాగాలపై బాంబులతో విరుచుకుపడుతోన్న రష్యా దళాలపై ఉక్రెయిన్ ప్రతిదాడికి దిగింది. సరైన ఆయుధాలు లేని మాస్కో సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ ఘటనలో రష్యా భారీ మొత్తంలో తమ సైన్యాన్ని నష్టపోయిందని ఉక్రెయిన్ రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. కీవ్ దాడుల్లో ఒక్క రోజే కనీసం వెయ్యి మంది రష్యా సైనికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్పై దాడి కోసం రష్యా ఇటీవల వేలాదిమంది సైనికులను ముందువరుసలో మోహరించింది. వీరిలో చాలా మంది రిజర్విస్టులే. అయితే వీరి వద్ద సరిపడా ఆయుధాలు లేవని కొద్ది రోజుల క్రితం బ్రిటిష్ రక్షణ నిఘా వర్గాల నిపుణులు తెలిపారు.
ఈ క్రమంలోనే ఉక్రెయిన్ సేనలు వారిపై దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో ఒక్కరోజులోనే కనీసం 1000 మంది క్రెమ్లిన్ సైనికులు మృతిచెందినట్లు ఉక్రెయిన్ రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రత్యేక సైనిక చర్యలో ఇప్పటివరకు రష్యా 71వేల మందికి పైగా సైనికులను నష్టపోయినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే తాజా మరణాలపై రష్యా అధికారికంగా స్పందించలేదు. ఉక్రెయిన్పై సైనిక చర్య కోసం ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ సైనిక సమీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే అనేక మంది రిజర్విస్టులను వెనక్కి పిలిపించి ఉక్రెయిన్లో యుద్ధానికి పంపించారు.
రష్యా అధికారుల ప్రకారం ప్రస్తుతం 41వేల మంది రిజర్విస్టులు ఉక్రెయిన్ దళాలతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. కెర్చ్ వంతెన పేలుడు తర్వాత ఉక్రెయిన్ రష్యా మధ్య పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో పేల్చివేతకు ప్రతీకారంగా ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా దళాలు పెద్దఎత్తున బాంబులతో విరుచుకుపడుతున్నాయి. దీంతో కీవ్ సహా అనేక ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురిఅవుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..