ఇరాన్ కళ్లు గప్పి .. కొండపై 50 గంటలు దాగి.. అమెరికన్ పైలట్ ఇంటర్వ్యూ..
నాటి ఇరాన్ యుద్ధంలో ఇరాన్ గగనతలంలో కూలిపోయిన అమెరికా ఎఫ్-15ఈ యుద్ధవిమానం నుంచి పారాచూట్ తో బయటపడి వెన్నుపూస విరగ్గొట్టుకున్నారు వెపన్స్ సిస్టమ్స్ ఆఫీసర్. అయినా శక్తినంతా కూడదీసుకుని 7 వేల అడుగులు కొండ పైకెక్కి.. 50 గంటలు ఓ కొండ చరియలో ఇరాన్ సైనికుల కంట పడకుండా దాక్కున్న తీరు అద్భుతం అని అప్పట్లో ప్రపంచం కొనియాడింది. సీబీఎస్ (CBS) నెట్వర్క్ '60 మినిట్స్' ప్రోగ్రామ్ ఇంటర్వ్యూలో తాజాగా ఆ రోజు ఏం జరిగిందో పూస గుచ్చినట్లు వివరించారు. ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

“ఆ రోజు మరో సాధారణ రోజులాగే గడిచింది, కానీ మా యుద్ధవిమానం పై ఇరాన్ ఒక మిసైల్ తో దాడి చేసింది, ” అని బ్రావో గుర్తుచేసుకున్నారు. దశాబ్దాలుగా అమెరికాకు సేవలందిస్తున్న 30 మిలియన్ డాలర్ల ఖరీదైన టూ-సీటర్ F-15E ఫైటర్ జెట్ను ఇరాన్, కేవలం లక్ష డాలర్లు ఖరీదు చేసే భుజం పై నుంచి కాల్చిన మిస్సైల్ తో కూల్చేసిందని తెలిపారు. మిస్సైల్ విమానాన్ని తాకిన క్షణం ఒక భారీ రైలు ఢీకొన్నట్లు అనిపించిందని బ్రావో గుర్తుచేసుకున్నారు. యుద్ధవిమానాన్ని రక్షించడానికి ‘అల్ఫా’ చేయగలిగినదంతా చేశాడని, కానీ విమానాన్ని కాపాడలేమని గ్రహించి ఇద్దరూ పారాచూట్ తెరచి బయటపడ్డామనీ చెప్పుకొచ్చారు.
సురక్షితంగా కిందికి దూకిన ‘అల్ఫా’ ను ఐదు గంటల తర్వాత అమెరికా సైన్యం రకించింది. అయితే చిరిగిన పారాచూట్తో బ్రావో, అల్ఫాకు 5 మైళ్ల దూరంలో దిగారట. ” అల్ఫా కు చెందిన పారాచూట్ నా కంటికి కనిపించక పోయేసరికి తీవ్రంగా భయపడ్డాను” అని బ్రావో సీబీఎస్ తో తెలిపారు. అసాధారణ స్పీడ్ తో నేలను ఢీకొట్టడంతో ఆయన వెన్నుపూస, ఒక చేయి, భుజం ఎముకలు విరిగిపోయాయి.
చీకట్లు వీడి ఉదయం అవుతున్న వేళ, శత్రు భూభాగంలో తప్పించుకునే ప్రణాళికను బ్రావో మొదలుపెట్టారు. ఇరువైపులా నిటారుగా ఉన్న కొండచరియల మధ్య ఒక లోయలో తాను ఉన్నట్లు గుర్తించి, వెళ్లేందుకు సురక్షితమైన ప్రదేశం ‘పైకి’ అని నిశ్చయించుకున్నారు. విరిగిన ఎముకలతోనే ఆయన కష్టపడి నడుస్తూ, 7,000 అడుగుల ఎత్తైన పర్వత శిఖరాన్ని (రిడ్జ్లైన్) ఎక్కారు. ” నాకు గాయాలయ్యాయి, కానీ సురకిత ప్రాంతానికి వెళ్లేలా మాకు ట్రైనింగ్ ఇవ్వడంతో నేను నేలకొరిగిన ప్రాంతం నుంచి వీలైనంత త్వరగా దూరంగా కదిలాను.” అన్నారు.
శత్రువుల భూభాగంలో సాహసం
శత్రువుల కంటపడకుండా తీవ్ర గాయాలతో ఆ ప్రాంతం నుంచి కదిలి బ్రావో, దాదాపు 7,000 అడుగుల ఎత్తైన పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. ఇరాన్ సాయుధ దళాలు అతన్ని వెతుకుతూ కేవలం వందల అడుగుల సమీపానికి వచ్చీ వెనుదిరిగాయి. పర్వత ప్రాంతంలోని ఒక చిన్న క్రెవిస్ లో (కొండచరియల సందు) దాదాపు 50 గంటల పాటు తలదాచుకోవడంతో బ్రావో వారికి కనిపించలేదు . చివరికి సీఐఏ (CIA) సాంకేతిక సహకారం, 90 మందికి పైగా అమెరికన్ ప్రత్యేక బలగాలు చేపట్టిన భారీ రెస్క్యూ ఆపరేషన్ ద్వారా ఈస్టర్ ఆదివారం ఉదయం తను సురక్షితంగా ఇరాన్ భూభాగం నుంచి బయటపడినట్లు సాహసోపేత ఆపరేషన్ ను బ్రావో ఇంటర్యూలో వెల్లడించారు.