AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నదిలో కాయిన్స్ వేసే అలవాటు ఉందా.? దాని వెనుక అసలు సీక్రెట్ ఇదిగో..

దేశంలో నదులను కేవలం నీటి వనరులుగానే కాకుండా దేవతలుగా పూజిస్తాం. గంగ, కృష్ణ, గోదావరి లాంటి నదులు మన నాగరికతకు పునాదులు. పూర్వం ఈ నదులే అందరికీ ప్రధాన తాగునీటి వనరులు. అందుకే వీటిని శుభ్రంగా ఉంచుకోవడానికి మన పెద్దలు అనేక పద్ధతులను పాటించేవారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

నదిలో కాయిన్స్ వేసే అలవాటు ఉందా.? దాని వెనుక అసలు సీక్రెట్ ఇదిగో..
Throwing Coins In River
Ravi Kiran
|

Updated on: May 14, 2026 | 3:30 PM

Share

మనం ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఏదైనా నది లేదా కాలువ కనిపిస్తే, వెంటనే జేబులోంచి ఒక రూపాయి బిళ్ళ తీసి నీళ్లలోకి విసిరేస్తుంటాం. చిన్నప్పటి నుండి మన పెద్దలు చేయడం చూసి మనం కూడా దీన్ని ఒక అలవాటుగా మార్చుకున్నాం. చాలామంది ఇది కేవలం అదృష్టం కోసమో లేదా దేవుడికి మొక్కుబడిగానో చేస్తారని అనుకుంటారు. కానీ, మన పూర్వీకులు ప్రవేశపెట్టిన ప్రతి ఆచారం వెనుక ఒక అద్భుతమైన శాస్త్రీయ కారణం దాగి ఉంది. ఈ నదుల్లో నాణేలు వేయడం వెనుక ఉన్న ఆ రహస్యం ఏంటో ఈరోజు తెలుసుకుందాం.

పాత రోజుల్లో మన తాతముత్తాతల కాలంలో నాణేలు అన్నీ ‘రాగి’తో తయారయ్యేవి. అప్పట్లో నేటిలాగా వాటర్ ఫిల్టర్లు, ప్యూరిఫైయర్లు ఉండేవి కావు. గ్రామాలు, పట్టణాల్లో ఉండేవారు నేరుగా నదులు, సరస్సుల నుండే నీటిని తాగునీరుగా వాడేవారు. రాగికి నీటిని శుభ్రపరిచే గుణం ఉందని సైన్స్ చెబుతోంది. నీటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను చంపే శక్తి రాగికి ఉంటుంది. అందుకే, ప్రజలు నదుల్లో రాగి నాణేలు వేయడం వల్ల ఆ నీరు శుద్ధి అయ్యి, ప్రజల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని మన పెద్దలు ఈ సంప్రదాయాన్ని మొదలుపెట్టారు.

మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాలలో రాగి ఒకటి. రాగి నాణేలు నీటిలో ఉన్నప్పుడు, ఆ ధాతువు నీటిలో కలిసి మన శరీరంలోకి చేరుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. అందుకే నది దాటే ప్రతిసారీ ఒక నాణెం వేయడం అనేది ఒక సామాజిక బాధ్యతగా ఉండేది. దీనివల్ల నదిలోని నీరు నిరంతరం శుద్ధి అవుతూ ఉండేది.

అయితే, కాలక్రమేణా పరిస్థితులు మారాయి. ప్రస్తుతం మనం వాడుతున్న నాణేలు రాగితో కాకుండా స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా అల్యూమినియంతో తయారవుతున్నాయి. వీటిని నీటిలో వేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లేవు, పైగా నీరు కలుషితమయ్యే అవకాశం ఉంది. రాగి నాణేలు వేయడం వెనుక ఉన్న సైన్స్‌ను మర్చిపోయి, కేవలం ఒక మూఢనమ్మకంగా మనం దీన్ని కొనసాగిస్తున్నాం. మన సంప్రదాయాలు ఏవీ అర్థం లేనివి కావు. కానీ వాటి వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇప్పుడు మనం వాడే స్టీల్ నాణేలను నదుల్లో పడేయడం కంటే, ఆ నీటిని పరిశుభ్రంగా ఉంచుకోవడంపై దృష్టి పెట్టడమే మన సంస్కృతికి మనం ఇచ్చే నిజమైన గౌరవం.

Follow Us