
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో మార్చి 27న సైబర్ క్రైమ్ కు సంబంధించిన ఫిర్యాదుతో జడ్చర్ల పోలీసులు రంగంలోకి దిగారు. బాదేపల్లిలో నివాసాముంటున్న వ్యాపారి జవార్ సునీల్ కు సైబర్ కేటుగాళ్లు వల వేశారు. సునీల్ వాట్సాప్ నెంబర్ ను Grovention media FX972 పేరుతో ఉన్న గ్రూప్ లో యాడ్ చేశారు. ఆ గ్రూప్ లో ప్రొడక్ట్స్, ప్రాంతాల గురించి గూగుల్ లో రివ్యూ ఇవ్వాలని… ఇస్తే ఒక్కో రివ్యూ కు రూ.150/- చొప్పున వస్తుందని చెప్పారు. దీంతో సరదగా ట్రై చేద్దామని కొన్నింటికి రివ్యూలు ఇవ్వగా వాటికి సునీల్ కు కొంత డబ్బు వచ్చింది. అనంతరం టెలిగ్రామ్ లో లింక్ పంపి మరో గ్రూప్ లో యాడ్ చేశారు. వివిధ టాస్క్ ల రూపంలో నగదు ఇన్వెస్ట్ చేస్తే అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని ఆశ చూపారు. గూగుల్ రివ్యూలకు డబ్బులు రావడంతో నమ్మిన సునీల్ వీటిలో మొదల కొంత నగదు పెట్టుబడి పెట్టాడు. వాటికి డబల్ లాభం పొందాడు. దీంతో క్రమంగా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాడు. అలా వివిధ మొత్తంలో రూ.36,20,180లను అందులో ఇన్వెస్ట్ చేశాడు. అయితే అధిక ఆదాయం కాదు కదా… పెట్టుబడి పెట్టిన డబ్బు ఒక్క రూపాయి కూడా రాలేదు. దీంతో ఆరా తీయగా మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
నగదు వెళ్లిన ఖాతాను ఆధారంగా చేసుకొని దర్యాప్తు:
తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి పేరుతో బురిడి కొట్టించిన సైబర్ ఘనుల ఆటకట్టించారు. మహబూబ్ నగర్ సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో జడ్చర్ల పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడి నుంచి కాజేసిన నగదు ఏ ఖాతాలోకి వెళ్ళిందని ఆరా తీశారు. సిద్దిపేట జిల్లాలోని ఓ బ్యాంకు ఖాతాలోకి వెళ్లినట్లు గుర్తించి… ఆ వివరాల ఆధారంగా తదుపరి దర్యాప్తు సాగించారు. అలాగే ఖాతాలో జమ అయ్యే నగదు విత్ డ్రా అవ్వడాన్ని సైతం తెలుసుకున్నారు. ఖాతాదారులు బ్యాంకు కు రాకున్నా అకౌంట్ లోని నగదు విత్ డ్రా అవ్వడాన్ని గుర్తించారు.
తీరా విషయంపై విచారణ చేయగా బ్యాంక్ లో పనిచేసే ఆపరేషన్ మేనేజర్ వల్లోజు శిరీష్ కుమార్ నిందితులకు సహకరిస్తున్నట్లు తేల్చారు. శిరీష్ కుమార్ ఖాతాలో నగదును నిందితులకు క్రిప్టో ట్రాన్స్ఫర్ పంపిస్తున్నాడు. ఇక మొత్తం ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులు మహమ్మద్ అబ్దుల్ ఫహాద్, సయ్యద్ ముస్తఫా ఖాద్రీ, సహకారం అందించిన ఆపరేషన్ మేనేజర్ వల్లోజు శిరీష్ కుమార్ అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ సమీయుద్దీన్ పరారీలో ఉన్నాడని జిల్లా ఎస్పీ జానకి వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..