21 వేల పానీపూరీలతో 13 అడుగుల వినూత్న బప్పా విగ్రహం.. నోరురించేలా వినయాకుడు! వీడియో వైరల్
ఓ గణేశ్ మండలపంలో ఏర్పాటు చేసిన ఓ వినూత్న గణేశుడి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. ఫెర్గూసన్ కాలేజ్ రోడ్డులోని గణేశ్ భేల్ వద్ద ఏకంగా 21 వేల పానీపూరీలతో 13 అడుగుల ఎత్తైన గణేశుడి విగ్రహాన్ని రూపొందించారు. దాదాపు రెండు నెలల పాటు శ్రమించి తయారు చేసిన ఈ బప్పా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది..

పూణె, సెప్టెంబర్ 18: మహారాష్ట్రలో గణేశోత్సవ వేడుకలు యేటా ఎంత ఘనంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది గణేశుడి విగ్రహాల్లో ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఈసారి పూణెలో ఏర్పాటు చేసిన ఓ గణేశుడి విగ్రహం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏకంగా 21 వేల పానీపూరీలతో 13 అడుగుల ఎత్తైన గణేశుడి విగ్రహాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఈ వినూత్న బప్పా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పుణెలోని ఫెర్గూసన్ కాలేజ్ (FC) రోడ్డులో ఉన్న గణేశ్ భేల్ వద్ద ఈ ప్రత్యేక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని తయారు చేసేందుకు ఉపయోగించిన ప్రతి పానీపూరీని జాగ్రత్తగా అమర్చి భారీ గణేశుడి రూపాన్ని తీసుకొచ్చారు.
రెండు నెలల పాటు శ్రమ.. 21 వేల పానీపూరీలతో బప్పా
గణేశోత్సవం సందర్భంగా ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనతో గణేశ్ భేల్ నిర్వాహకులు రూపేష్, దినేష్ గుడ్మేవర్ ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. కళాకారుడు ప్రశాంత్ సాలుంఖే ఆధ్వర్యంలో విగ్రహాన్ని రూపొందించారు. ఈ గణేశుడి విగ్రహం సుమారు 13 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పు ఉంటుంది. దీన్ని తయారు చేసేందుకు దాదాపు రెండు నెలల సమయం పట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ముందుగా వెదురు, కాగితంతో విగ్రహానికి ఫ్రేమ్ను సిద్ధం చేసి, దానిపై వేలాది పానీపూరీలను ఎంతో జాగ్రత్తగా అమర్చారు. ఇందులో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. పానీపూరీల తయారీలో మిగిలిపోయే పిండిని వృథా చేయకుండా ఉపయోగించినట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో ఆహార వృథాను కూడా కొంతవరకు తగ్గించినట్లయింది.
గణేశోత్సవం తర్వాత ఆ పానీపూరీలన్నీ ఏం చేస్తారు?
వేలాది సున్నితమైన, పెళుసైన పానీపూరీలతో ఇంత భారీ విగ్రహాన్ని తయారు చేయడం అంత సులభం కాదు. చిన్న ఒత్తిడి, తేమ తగిలినా పానీపూరీలు దెబ్బతినే అవకాశం ఉండటంతో విగ్రహం వద్ద కళాకారులు 24 గంటల పాటు పర్యవేక్షణ చేస్తున్నారు. దూరం నుంచి చూస్తే ఇది సాధారణంగా కనిపించే భారీ గణేశుడి విగ్రహంలాగే ఉంటుంది. కానీ దగ్గరకు వెళ్లి చూస్తే మాత్రం మొత్తం విగ్రహం పానీపూరీలతో తయారు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో అక్కడికి వచ్చే భక్తులు, సందర్శకులు ఆసక్తిగా ఈ విగ్రహాన్ని తిలకిస్తున్నారు. ఈ విగ్రహానికి సంబంధించిన మరో ప్రత్యేకత కూడా ఉంది. సాధారణంగా గణేశుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. అయితే 21 వేల పానీపూరీలను నీటిలో నిమజ్జనం చేయకుండా సేంద్రీయ ఎరువుగా మార్చాలని నిర్వాహకులు నిర్ణయించారు. అంటే గణేశోత్సవం ముగిసిన తర్వాత కూడా ఈ విగ్రహం కోసం ఉపయోగించిన ఆహార పదార్థాలను వృథా చేయకుండా ఉపయోగించనున్నారు.
View this post on Instagram
బంగారు మోదకాలు, వివిధ రకాల స్వీట్లతో గణేశుడి విగ్రహాలు ఇప్పటి వరకు వైరల్గా మారాయి. ఇప్పుడు పానీపూరీలతో బప్పాను తయారు చేయడం ఆసక్తిగా మారింది. కాగా గణేశోత్సవ వేడుకల్లో ఆహార పదార్థాలతో చేసే సృజనాత్మకత కొత్త రూపాలను సంతరించుకుంటోంది. ఈసారి పుణెలో భారతీయుల ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ అయిన పానీపూరీ.. గణేశుడి అలంకరణలో భాగమై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.




