అసెంబ్లీ అడ్డాగా.. రాజుకున్న అగ్గి.. బీజేపీ వర్సెస్ ఎంఐఎం.. మధ్యలో హస్తం!
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి.. రెండ్రోజులు కూడా కాలేదు, అప్పుడే పొలిటికల్ పొగ రాజుకుంది. అసెంబ్లీ సాక్షిగా రాజకీయ సెగ రేగుతోంది. ప్రొటెం స్పీకర్ ఎంపిక.. పెద్ద రచ్చకు దారి తీసింది. బీజేపీ వర్సెస్ ఎంఐఎం.. మధ్యలో కాంగ్రెస్ అన్నట్టుగా తయారైంది.
తెలంగాణలో అలా కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిందో.. ఇలా రాజకీయ రచ్చకు బీజం పడింది. మూడో అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీని ఎంపిక చేయడం.. వివాదానికి కారణమైంది. సాధారణంగా అసెంబ్లీలో సీనియర్గా ఉన్న ఎమ్మెల్యేను.. ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేస్తుంటాయి కొత్త ప్రభుత్వాలు. కానీ, అనూహ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం… అక్బర్ను సెలెక్ట్ చేయడం రాజకీయ చర్చకు దారి తీసింది.
కాంగ్రెస్ తీరుపై కయ్యుమంటోంది బీజేపీ. తుమ్మితే ఊడిపోయేలా ఉన్న తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే.. ఇలా ఎంఐఎంను దువ్వుతోందంటూ ఆరోపణలు సంధించారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. దాదాపు 99మంది ఎమ్మెల్యేలతో అక్బర్ ప్రమాణం చేయిస్తే.. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం సభను బాయ్కాట్ చేశారు.
అయితే, బీజేపీ ఆరోపణలు అదే స్థాయిలో తిప్పికొడుతోంది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగం ప్రకారమే ప్రొటెం స్పీకర్గా అక్బర్ ఎంపిక జరిగిందనిచెబుతోంది. ప్రతీదీ మతం కోణంలో చూడాల్సిన అవసరం లేదంటూ కాషాయదళానికి గట్టి కౌంటర్ ఇచ్చింది. బీజేపీ ఆరోపణలు ఎలా ఉన్నా… పదేళ్లుగా ఎంఐఎంతో డిస్టాన్స్ మెయింటెన్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు సడెన్గా ప్రొటెం స్పీకర్ పదవిని ఆ పార్టీకి ఆఫర్ చేయడం వెనక ఏదో మతలబు ఉందన్న చర్చ జరుగుతోందిప్పుడు. బోటాబోటీ మెజార్టీతో ఉన్న తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే .. మళ్లీ ఎంఐఎంకు దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న బీజేపీ విమర్శలూ కీలకంగా మారాయిప్పుడు. మరి నిజమేంటనేది.. ఇంకొన్నాళ్లాగితే గానీ తెలియదు. మొత్తానికి ఎంఐఎం వర్సెస్ బీజేపీ మధ్యలో కాంగ్రెస్ అన్నట్టుగా తయారైంది పరిస్థితి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…