Rains In Telangana And AP: తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వానలు.. మరో రెండు రోజులు వర్షాలే..!

| Edited By: Ravi Kiran

May 27, 2022 | 11:52 AM

ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి. ఈదురు గాలులతో కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి...

Rains In Telangana And AP: తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వానలు.. మరో రెండు రోజులు వర్షాలే..!
Hyderabad Rains
Follow us on

ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి. ఈదురు గాలులతో కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నిన్న పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వాన పడింది. శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, పలు ప్రాంతాల్లో వర్షం తీవ్ర ఇబ్బందులు సృష్టించింది. గాలి దూమరానికి నాంపల్లిలోని ఆర్డీవో కార్యాలయ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం నుంచి ఇనుప రేకులు కొట్టుకువచ్చాయి. ఈ ఘటనలో మూడు కార్లు ధ్వంసమయ్యాయి. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం, గుమ్మడిదల ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన జోరు వాన కురిసింది. దాదాపు గంట పాటు కురవడంతో భూతాపం చల్లబడింది. రోడ్ల పక్కన గుంతలన్నీ నీటితో నిండాయి. గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలో వర్షం నీరు వరదగా పారింది.

గ్రామాలు, పారిశ్రామిక వాడలో గాలి దుమారానికి చెట్లు కూలాయి. చెట్టు కొమ్మలు విరిగాయి. దీంతో కొద్ది సేపు కరెంటుకు అంతరాయం ఏర్పడింది. నిర్మల్ జిల్లా భైంసాలో భారీ ఈదురు గాలులకు తోడు ఉరుములు , మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముధోల్ మండలం చింతకుంట కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తడిసిపోయింది. ఏపీలోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. కడప నగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో కురిసిన వానకు పలు చోట్ల ధాన్యం తడిసిపోయింది. రానున్న రెండు రోజుల్లో తెలంగాణ వర్షాలు కురిసే అవకాశం ఉన్న వాతావరణ శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి