Telangana: అన్నదాతని మోసం చేసి.. నకిలీ పురుగు మందులు, విత్తనాలు విక్రయిస్తున్న ముఠాల గుట్టు రట్టు.. భారీగా ముడి సరుకులు స్వాధీనం..
నకిలీ పురుగు మందులు విత్తనాలతో అమాయక రైతులను మోసం చేస్తున్న పాపాత్ములు కటకటాల పాలయ్యారు.. వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో భారీ ఎత్తున నకిలీ విత్తనాలు పురుగుమందులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని విక్రయిస్తున్న రెండు ముఠాలకు చెందిన వ్యక్తులను కటకటాల్లోకి పంపారు..

రెండు వేర్వేరు ఘటనల్లో వరంగల్ పోలీసులు భారీ ఎత్తున నకిలీ విత్తనాలు, పురుగు మందులను గుర్తించారు. అమాయక రైతులను లక్ష్యంగా చేసుకోని ప్రముఖ కంపెనీల పేర్లతో పాటు, గడువుతీరిన పురుగు మందులు, నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రెండు ముఠాలకు చెందిన ఏడుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు, పరకాల, గీసుగొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ఈ ముఠాల నుండి పోలీసులు సుమారు 63లక్షల 62వేల రూపాయల విలువ గల నకిలీ, కాలం తీరిన పురుగు మందులు, 166 కిలోల నకిలీ విత్తనాలు, 8వందల లీటర్ల గడ్డి మందులు, నకిలీ పురుగు మందుల తయారీకి అవసమయిన ముడి సరుకులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్టుచేసిన వారిలో మేడ్చల్ మల్కాజిగిరి కి చెందిన జయదీప్ గౌతమ్, హైబరాబాద్ కు చెందిన ఆదిత్య , సంగారెడ్డి జిల్లాకు చెందిన విజయ్, సందీప్ రెడ్డి, వరంగల్ జిల్లాకు పరకాల కు చెందిన తిరుపతి, ములుగు ఘనపూర్ కు చెందిన అన్నం కుమారస్వామి, ఎలకుర్తి హవేలీకి చెందిన మర్రిరెడ్డి ఉన్నారు.
పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు, పరకాల పోలీసులు, వ్యవసాధికారులు సంయుక్తంగా కలిసి ప్రధాన నిందితుడు నాగారం చెందిన మాబొయిన తిరుపతి ఇంటిపై దాడులు చేశారు. ఈ క్రమంలో నకిలీ విత్తనాలు, కాలం తీరిన పురుగు మందులను పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుడిని పోలీసులు విచారించగా నిందితుడు ఇచ్చిన సమచారంతో పోలీసులు హైదరాబాద్ లోని మోహిదీపట్నం ప్రాంతంలో నకిలీ పురుగు మందులు తయారు చేస్తున్న గోదాంపై దాడి చేశారు.. ఈ క్రమంలో సుమారు 57లక్షల 44వేల రూపాయల విలువగల నకిలీ, కాలం తీరిన పురుగు మందులను స్వాధీనం చేసుకోవడంతో పాటు జయదీప్ గౌతం, ఆదిత్య,కుమార స్వామిలను పోలీసులు అరెస్టు చేసారు.
మరో ఘటనలో పోలీసులకు అందిన సమాచారంతో గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్కుర్తి హవేలీ ప్రాంతంలో బెరిరెడ్డి మర్రిరెడ్డి ఇంటిపై దాడి చేసిన పోలీసులు ఒక కిలో నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు విచారించగా నిందితుడు ఇచ్చిన సమాచారం సంగారెడ్డి జిల్లా చింతల చేరువు గ్రామానికి చెందిన తుమ్మగుండ్ల సందీప్ రెడ్డి, తుమ్మగుండ్ల విజయ్ జోసెఫ్ ఇండ్లలో సోదాలు నిర్వహించారు. వారి ఇళ్లలో సుమారు 6లక్షల 18వేల రూపాయల విలువ గల 166 కిలోల నకిలీ విత్తనాలతో పాటు 8వందల లీటర్ల గడ్డి మందును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. నిందితులను పట్టుకొవడంలో ప్రతిభ కనబరిచన టాస్క్ఫోర్స్ పోలీసులు, గీసుకొండ, పరకాల పోలీసులతో పాటు వ్యవసాయాధికారులను సీపీ అభినందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








