Telangana: అయ్యో నా పతి దేవుడ్ని కిడ్నాప్ చేశారంటూ భార్య వర్రీ.. అయ్యగారి పులిహోర కథ మామూలు లేదుగా.. సినిమాను మించి..
సినిమా స్క్రిప్ట్ను తలపించేలా పక్కా ప్లాన్తో సాగిన కిడ్నాప్ డ్రామా ఇది.. భార్య కళ్లల్లో మట్టి కొట్టి, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఒక భర్త వేసిన మాస్టర్ ప్లాన్ చివరకు అట్టర్ ప్లాప్ అయ్యింది. ఉప్పల్ పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసిన అసలు ట్విస్ట్ ఏంటీ..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సాధారణంగా ఎవరైనా కిడ్నాప్ అయ్యారంటే కుటుంబ సభ్యులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోలీసులను ఆశ్రయిస్తారు. కానీ హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక వింత ఘటన పోలీసులనే అవాక్కయ్యేలా చేసింది. స్నేహితుల కోసం వెళ్తున్నానని చెప్పి.. ప్రియురాలితో కలిసి పరారైన ఒక భర్త నిర్వాకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రామంతాపూర్ జనప్రియ అపార్ట్మెంట్లో నివసించే రావూరి పూర్ణచందర్ అనే వ్యక్తి మాదాపూర్లోని ఒక పబ్లో పర్చేజ్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అయితే అతడు గురువారం రాత్రి ఒక వింత నాటకానికి తెరలేపాడు. ఇంట్లో నిద్రిస్తున్న భార్య బయటకు రాకుండా డోర్ బయట గడియ పెట్టాడు. పోలీసులు తనను ట్రాక్ చేయకుండా మొబైల్ ఫోన్ను ఇంట్లోనే వదిలేశాడు. స్నేహితులు వచ్చారని నమ్మించి, అపార్ట్మెంట్ బయట వేచి ఉన్న ఇద్దరు యువతులు, మరో వ్యక్తితో కలిసి వాహనంలో మాయమయ్యాడు.
భార్య ఆందోళన.. పోలీసుల ఎంట్రీ
ఉదయం లేచి చూసేసరికి భర్త కనిపించకపోవడం, డోర్ బయట గడియ పెట్టి ఉండటంతో భార్య కంగారుపడింది. సీసీటీవీ ఫుటేజీలో గుర్తుతెలియని వ్యక్తులు తన భర్తను తీసుకెళ్లడం చూసి అది కిడ్నాప్ అని నమ్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను పనిచేసే పబ్ నిర్వాహకులు కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు సీరియస్ అయ్యింది.
అసలు ట్విస్ట్
కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించగా అసలు నిజం బయటపడింది. సీసీటీవీలో కనిపించిన యువతుల్లో ఒకరు అదే పబ్లో పనిచేస్తుందని పోలీసులు గుర్తించారు. ఆమెను గట్టిగా ప్రశ్నించగా.. పూర్ణచందర్ చాలా కాలంగా ఒక బెంగాలీ యువతితో సహజీవనం చేస్తున్నాడని, ఆమెతో కలిసి ఉండటానికే ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తేలింది. ప్రస్తుతం వారిద్దరూ ఒడిశాలో ఉన్నట్లు సెల్ టవర్ లోకేషన్ ద్వారా పోలీసులు నిర్ధారించారు. తొమ్మిదేళ్ల కూతురు, భార్య ఉన్నప్పటికీ.. అక్రమ సంబంధం కోసం ఇంతటి హైడ్రామా క్రియేట్ చేయడం స్థానికంగా కలకలం రేపింది.
