NEET UG 2025 Exam Fear: కఠినంగా నీట్ పరీక్ష.. ఫెయిల్ అవుతామన్న భయంతో ఇద్దరు విద్యార్ధులు సూసైడ్!
నాలుగు రోజుల క్రితం జరిగిన నీట్ యూజీ పరీక్ష 2025 ప్రశ్నాపత్రం జేఈఈ స్థాయిని మించి ఇచ్చారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ పరీక్షకు హాజరైన దాదాపు 20 లక్షలకు పైగా విద్యార్ధుల గుండెల్లో గుబులు పట్టుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు విద్యార్ధులు ఫెయిల్ భయంతో ఉరి వేసుకుని తనువు చాలించారు..

జగిత్యాల, మే 7: నీట్ యూజీ పరీక్ష జరిగి పట్టుమని నాలుగు రోజులు కూడా గడువక ముందే ఇద్దరు విద్యార్ధులు ప్రాణాలు తీసుకున్నారు. మే 4వ తేదీన ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగగా.. దాదాపు 20.8 లక్షలకు పైగా విద్యార్ధులు ఈ పరీక్ష రాశారు. ఈ సారి నీట్ పరీక్ష క్వశ్చన్ పేపర్ చాలా కఠినంగా వచ్చినట్లు పలువరు అభ్యర్ధులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫిజిక్స్ విభాగంలో ప్రశ్నలు అత్యంత కఠినంగా ఉన్నట్లు తెలిపారు. ఇదే ప్రస్తుతం నీట్ అభ్యర్ధుల్లో గుబులు పుట్టిస్తుంది. కనీసం పాస్ మార్కులైనా వస్తాయో లేదోనన్న భయంతో నీట్ పరీక్ష రాసిన ఒక రోజు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
జగిత్యాల్ జిల్లాకు చెందిన జంగా పూజ అనే విద్యార్ధిని 2023 లో మొదటిసారి నీట్ పరీక్షకు హాజరైంది. కానీ అందులో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఆ తర్వాత కోచింగ్ క్లాస్లకు కూడా హాజరై మళ్లీ నీట్ పరీక్షకు సిద్ధమైంది. ఈ క్రమంలో మే 4న జరిగిన నీట్ పరీక్షకు మళ్ళీ పరీక్షకు పూజ మళ్లీ హాజరయింది. అయితే ఈసారి పరీక్ష మరింత కఠినంగా ఉండటంతో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో వేధనకు గురైంది. ఇంటికి చేరుకున్న వెంటనే సమాధానాలను క్రాస్ చెక్ చేసుకోగా మార్కులు తక్కువ వస్తాయనే భయం ఆమెను ముంచెత్తింది. అంతే ఇంట్లోకి వెళ్లి ఉరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది.
మరోవైపు రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మరో నీట్ అభ్యర్థి రాయి మనోజ్ కుమార్ కూడా నీట్ పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్ కుమారుడైన మనోజ్ కుమార్ హైదరాబాద్లో కోచింగ్ కూడా తీసుకున్నాడు. పరీక్ష రాసిన తర్వాత సోమవారం ఇంటికి తిరిగి వచ్చిన మనోజ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.