Inspiration Story: 80 ఏళ్ల తర్వాత ఆ ఊర్లో టెన్త్ పాసైన తొలి విద్యార్ధి.. ఊరుఊరంతా సంబరాలు! ఈ దినసరి కూలి కథ మీకు చెప్పాలి..
రామ్ సేవక్.. పేరుకు తగ్గట్టే ఓ బాలుడు రాష్ట్ర మంతా తిరిగి చూసేలా అద్భుతం చేశాడు. 80 ఏళ్లుగా అజ్ఞానాంథకారంలో మగ్గిపోతున్న తన ఊరి జనాలకు ఊపిరి పోశాడు. తరాలు మారుతున్న అక్షర జ్ఞానం అబ్బని ఆ ఊరి జనాలకు కొత్త ఆశలు నింపాడు. ఈ 16 ఏళ్ల బాలుడు కొత్తగా ఏమీ చెయ్యలేదు.. కేవలం పదో తరగతి పాసైయ్యాడంటే! అదే ఆ ఊరిలో మహా అద్భుతం..

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పదో తరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లోని రాష్ట్ర రాజధాని లక్నోలోని ఓ మారుమూల గ్రామంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అక్కడి బారాబంకి జిల్లాలోని నిజాంపూర్ గ్రామంలో గత 78 సంవత్సరాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా పదో తరగతి పూర్తి చేయలేదు. అయితే ఈ ఏడాది మాత్రం రామ్ సేవక్ (16 ఏళ్ల) అనే బాలుడు ఇన్నేళ్లకుగానూ పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించాడు. తాజాగా విడుదలైన ఉత్తరప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో రామ్ సేవక్ 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి.. తన గ్రామంలోనే తొలి వ్యక్తిగా నిలిచాడు. బాలుడి ప్రతిభను ఆ ఊరి జనాలు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఏకంగా డీఎం సాహెబ్ బాలుడిని సత్కరించి అభినందించారు.
మా ఊరిలో అందరూ కూలీలే..
నిజానికి, రామ్ సేవక్ టెన్త్లో తెచ్చుకున్నది సెకండ్ క్లాస్ మార్కులే అయినప్పటికీ అతడి పేరు మాత్రం రాష్ట్ర మంతా మారుమ్రోగిపోయింది. జిల్లా కేంద్రానికి దాదాపు 28 కిలోమీటర్ల లోపల ఉన్న నిజాంపూర్ గ్రామంలో మొత్తం జనాభా 300 మంది. అహ్మద్పూర్ గ్రామ పంచాయతీ పరిధికి చెందిన ఈ గ్రామంలో పిల్లలు విద్యానభ్యసించడానికి ప్రాథమిక పాఠశాల, చక్కని రోడ్లు కూడా ఉన్నాయి. అయితే ఈ గ్రామంలో పేదరికం కారణంగా చాలా వరకు జనాలు దినసరి కూలీలుగా మారారు.. రామ్ సేవక్ తండ్రి జగదీష్ ప్రసాద్ కూడా కూలీనే. రామ్ సేవక్ కూడా కుటుంబం గడవడం కోసం ఊర్లో జరిగే వివాహ ఊరేగింపుల్లో తలపై దీపాలు మోసేవాడు. వచ్చిన డబ్బుతో కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవాడు. అతను చాలా కష్టతరమైన మైళ్లు నడిచి నిజాంపూర్లో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన మొట్టమొదటి నివాసి అయ్యాడు.
రామ్ సేవక్ తండ్రి జగదీష్ ప్రసాద్, తల్లి పుష్ప, ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు సోదరీమణులతో కూడిన ఏడుగురు సభ్యుల కుటుంబం. వీరు నివసించే పూరిగుడిసెకు రెండు గదులు. అందులో ఒక గదిలో పశువులకు మేత ఉంటుంది. మరొక గది మొత్తం కుటుంబం నివసిస్తారు. వీరి ఇంటికి కనీసం విద్యుత్ సదుపాయం కూడా లేదు. కానీ ఎమ్మెల్యే కోటా కింద అందించబడిన సోలార్ లైట్ రాత్రిపూట వారికి దిక్కు. రాంసేవక్ పగలంటా కూలి పనికెళ్లి రాత్రిళ్లు సోలీర్ లైట్ వద్దనే చదువుకునేవాడు.
పాఠశాలకు రోజూ అర కిలోమీటర్ నడిచి..
రామ్ సేవక్ తన కథను వివరిస్తూ.. ఇంజనీర్ కావాలనే నా కలను నెరవేర్చుకోవడానికి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువు ప్రారంభించాడు. రామ్ సేవక్ తల్లి పుష్ప ఆ బడిలోనే మధ్యాహ్న భోజనం వండుతుంది. ఐదవ తరగతి వరకు చదువు పూర్తి చేసిన తర్వాత, రామ్ సేవక్ గ్రామం నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో 6వ తరగతిలో చేరాడు. 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో నువ్వు చదువు కోసం నీ సమయాన్ని వృధా చేస్తున్నావని గ్రామంలోని ప్రతి ఒక్కరూ తనను నిరుత్సాహపరిచేవారని, నువ్వు ఎప్పటికీ 10వ తరగతి పాస్ కాలేవని ఎగతాళి చేసేవారని అన్నాడు. కానీ రామ్ మాత్రం అన్ని సబ్జెక్టుల్లో పాసై వారి అభిప్రాయం తప్పు అని నిరూపించాలని మౌనంగా ఉండేవాడినని తెలిపాడు. కళ్ళలో ఆశ, గుండెల్లో విశ్వాసం ఆరనివ్వక కష్టపడి చదివానని చెబుతున్నాడు.
కూలి పనులకు పోతూ పుస్తకాలు కొనుక్కుని చదివా..
రామ్ సేవక్ తన సోదరులలో పెద్దవాడు. కుటుంబాన్ని చూసుకునే బాధ్యత అతడిదే. కుటుంబ పేదరికమే తనతో అన్నీ చేయించిందని.. పెళ్లిళ్ల సీజన్లో పెళ్లి ఊరేగింపులకు తలపై లైట్లు మోసుకెళ్లి రాత్రికి రూ. 200-300 సంపాదిస్తానని.. పెళ్లిళ్లు అయిపోయాక కూలి పనులకు పోయేవాడినని అన్నాడు. ఎంత సంపాదించినా తన పుస్తకాలు, ఫీజులతో సహా అంతా తన చదువుకు ఖర్చుఅయిపోయేవని అన్నాడు. అంతేకాకుండా తన ఖర్చుల కోసం తన తల్లిదండ్రులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని రామ్ సేవక్ తెలిపాడు. అయితే టెన్త్ ఫలితాల్లో రామ్ పాసైనట్లు తెలియడంతో ఊరుఊరంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. బారాబంకి DM శశాంక్ త్రయాప్తి రామ్ సేవక్ని సన్మానించారు. ఆ సమయంలో రామ్ వద్ద సరైన బట్టలు, బూట్లు కూడా లేవు. దీంతో రామ్ చదివిన పాఠశాల ఉపాధ్యాయులు అతడికి వీటిని కొన్నారు. రామసేవక్ బూట్లు ధరించడం అదే మొదటిసారట. డీఎం తన కార్యాలయంలో తనను సత్కరించడమే కాకుండా, తన మిగిలిన చదువులకు ఫీజును కూడా తానే చెల్లిస్తానని చెప్పడంతో రామ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
మా ఊర్లో ఎవ్వరికీ సాధ్యం కానిది.. నా బిడ్డ సాధించాడు..
తన కొడుకు సాధించిన విజయానికి సంతోషంగా ఉన్న రామ్ సేవక్ తల్లి పుష్ప తెలిపింది. తాను కూడా ఐదవ తరగతి వరకు చదివానని, ఎంత కష్టమైనాసరే తన పిల్లలను చదివించడానికి వెనకాడనని అంటోంది. మేము చాలా పేదవాళ్ళం. పిల్లలను ఎలాగోలా చదివించగలుగుతున్నాం. రామ్ 10వ తరగతి పాస్ అవుతాడని ఎప్పుడూ ఊహించలేదు. నా కొడుకులలో ఒకరు 9వ తరగతి, మరొకరు 5వ తరగతి చదువుతున్నారు. నా కూతురు 1వ తరగతి చదువుతుంది. పెద్ద కుమార్తెకు వివాహం జరిగింది. తన కొడుకు 10వ తరగతిలో అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులతో పాసయ్యాడని తల్లి గర్వంగా చెబుతుంది. మా ఊరిలోని ముఖేష్, లవ్లేష్ అనే ఇద్దరు బాలురు 10వ తరగతిలో ఫెయిల్ అయ్యారు. నా కొడుకు మాత్రం పాసై అసాధ్యాన్ని సుసాధ్యం చేసాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. అతను కోరుకున్నంత వరకు చదివించేందుకు సాయశక్తులా తోడ్పాటునందిస్తానని కొడుకుని చూసి గర్వంగా చెబుతున్నాడు తండ్రి జగదీష్ ప్రసాద్.
ఇంజనీరింగ్ నా కల..
తాను విజయం సాధించడానికి కారణం తన కుటుంబం ఎదుర్కొంటున్న పేదరికమే కారణమని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుని కుటుంబానికి మంచి జీవితాన్ని అందించాలన్న దృఢ సంకల్పంతో అన్ని అడ్డంకులను అధిగమించి తాను ఈ విజయాన్ని సాధించానని రామ్ సేవక్ అంటున్నాడు. జీవితంలో మొదటిసారి ఈ కీలక మైలురాయిని సాధించానని, ఇక ఇప్పుడు ఇంజనీర్ కావాలనే తన కల కోసం పోరాడుతానని చెబుతున్నాడీ రామ్ సేవక్. అన్నీ ఉన్న ఉంట్లో పుట్టిన చాలా మంది చదువును నిర్లక్ష్యం చేస్తున్న ఈ రోజుల్లో పేదరికంలో మగ్గిపోతున్నా సరే ఆశను చావనివ్వక జీవితంలో గెలవాలని తపిస్తున్న ఈ రామ్ సేవక్ కోరిక నెరవేరాలని మనమందరం కోరుకుందాం..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.