Revanth Reddy: 420 కింద జైల్లో వేయాల్సిన అతడ్ని మంత్రిని చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే: రేవంత్ రెడ్డి

420 కింద జైల్లో వేయాల్సిన మల్లారెడ్డిని మంత్రిని చేసిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్

Revanth Reddy: 420 కింద జైల్లో వేయాల్సిన అతడ్ని మంత్రిని చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే:  రేవంత్ రెడ్డి
Revanth Reddy
Follow us

|

Updated on: Aug 27, 2021 | 9:24 PM

Revanth Reddy – Malla Reddy – KCR: 420 కింద జైల్లో వేయాల్సిన మల్లారెడ్డిని మంత్రిని చేసిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్‌ విషయానికి సంబంధించి విజిలెన్స్ విచారణలో వందల కోట్లు దోపిడీ చేశారని వెల్లడైందన్న రేవంత్.. పచ్చిదొంగలను కేసీఆర్ ప్రొత్సహిస్తున్నారని ఆరోపించారు. “దత్తత పేరుతో గ్రామాలను తీసుకొని.. ఫాంహౌస్ కు రోడ్డు వేసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరిస్తే.. ప్రతిపక్షం తరపున ప్రశ్నించే హక్కు లేదా? మూడు గ్రామాల్లో ఇచ్చిన హామీలను సీఎం హోదాలో కూడా అమలు చేయలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పిచ్చి కుక్కలుగా ఉన్మాదులుగా ప్రవర్తిస్తున్నారు.” అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

“సమస్యను పక్కదారి పట్టించేందుకు చిల్లర వేషాలు వేస్తున్నారు. తిట్ల పోటీ పెట్టుకుందామంటే మేం రెడీ. ప్రగతి భవన్ కు లేదా ఫాంహౌస్ కు రమ్మనా వస్తా. మల్లారెడ్డి అవినీతిని కేటీఆర్, కేసీఆర్ సమర్థిస్తున్నారా..? 2019లో నేను గెలించిందే మల్లారెడ్డి మీద.. నేను సవాల్ చేస్తున్న.. ప్రభుత్వాన్ని రద్దు చేసి రమ్మను.. అంత ధైర్యం లేకపోతే.. గజ్వేల్ లో రాజీనామా చేయి.. తేల్చుకుందాం. మధ్యలో చెంచాలతో తొడగొట్టడాలేం. ముందస్తు ఎన్నికలకు వస్తే కాంగ్రెస్ బలం ఏంటో చూపిస్తాం.” అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు .

“తెలంగాణ రాష్ట్రం వచ్చాక అసెంబ్లీ సమావేశాల్లో చర్చల సందర్భంగా అవినీతికి తావులేదన్నారు. అవినీతికి ఎవరు గురైన చర్యలు తీసుకుంటామన్నారు. రాజయ్య మీద ఆరోపణలు వస్తే మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేశారు. ఈటల రాజేందర్ మీద అసైన్డ్ భూములు ఆక్రమించారని భర్తరఫ్ చేశారు. దేవరయంజాల్ లో దేవుని భూములు ఆక్రమించారని ఐఏఎస్ ల కమిటీ వేశారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కి సంబంధించిన కొన్ని ఆధారాలు ఇస్తున్న 50 ఎకరాలలో లేఅవుట్ వేస్తే.. మామూళ్లు ఇవ్వాలని బహిరంగంగా వసూలు చేశారు. సీఎం కేసీఆర్ ఈ అక్రమాలపై ఎందుకు విచారణ చేయడం లేదు.?” అని రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ సర్కారుని నిలదీశారు.

“మల్లారెడ్డి యూనివర్సిటీ సంబంధించి తప్పుడు పత్రాలతో అనుమతులు పొందారు. గుండ్లపోచంపల్లిలో సర్వేనెంబర్ 650లో 22 ఎకరాల 8 గుంటలు మాత్రమే. ఈ భూమి ఒక్కసారిగా ధరణి పోర్టల్ కు వచ్చేసరికి 33 ఎకరాల 26 గుంటలుగా మారింది. న్యాక్ గ్రేడింగ్ కోసం పెట్టిన పత్రాలన్ని పోర్జరీ పత్రాలని .. న్యాక్ నిషేధించింది. ఫోరెన్సిక్ ధృవపత్రాలలన్ని తప్పుడువని 5 ఏళ్లు న్యాక్ నిషేధించింది.” అని రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ గాంధీ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో చెప్పుకొచ్చారు. కాగా,  మంత్రి మల్లారెడ్డి ఇటీవల రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో రేవంత్ ఇవాళ ప్రెస్ మీట్లో కౌంటరిచ్చే ప్రయత్నం చేశారు.

Read also: Education Summit: గుడ్ న్యూస్: రేపటి నుంచే టీవీ9-KAB ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌