డ్రగ్ మాఫియా బెండుతీస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. గోవాకేంద్రంగా 5 రాష్ట్రాల్లో డ్రగ్ దందా చేస్తున్న బాలమురుగున్ను అరెస్ట్ చేశారు. కూపీలాగితే బల్క్ డ్రగ్స్ తో పాటు సినీ లింకుల డొంక కదులుతోంది. బాలమురుగన్ కస్టమర్ల జాబితాలో హైదరాబాదీలూ వున్నారు. వాళ్లెవరో త్వరలో లిస్టౌట్ చేసేలా పోలీస్ యాక్షన్ మొదలైంది. 5 రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా కొనసాగిస్తున్న డ్రగ్ కింగ్ పిన్ బాలమురుగన్ను తెలంగాణలో నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, రాంగోపాల్పేట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గోవా కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో మత్తు పదార్థాల వ్యాపారం చేస్తున్న ఎడ్విన్కు బాలమురుగన్ ప్రధాన అనుచరుడు. ఇద్దరూ కలిసి 15 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు మత్తుపదార్థాలు తరలిస్తూ కోట్లకు పడగెత్తారు.
పోలీసులకు చిక్కకుండా దర్జాగా మత్తు వ్యాపారం సాగించిన ఎడ్విన్ను కూడా ఈ మధ్యే పోలీసులు అరెస్ట్ చేశారు.అతడిచ్చిన సమాచారంతో గోవా,ఢిల్లీ,ముంబై,తమిళనాడు ప్రాంతాల్లో బాలమురుగన్ కోసం గాలించారు. గోవాలో తలదాచుకున్నట్టు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. లోకల్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్ తీసుకొచ్చారు. తమిళనాడుకు చెందిన బాలమురుగన్ హోటళ్లు నిర్వహిస్తున్నాడు. రాజస్థాన్,హిమాచల్ప్రదేశ్,తమిళనాడు,కేరళ,గోవాలోని పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు ఏర్పాటు చేశాడు. బయటి ప్రపంచానికి తెలియకుండా డ్రగ్స్ అమ్ముతున్నాడు.
విందు, వినోదాలతో పర్యాటకులను ఆకట్టుకుని డ్రగ్స్ చేరవేసేవాడు బాలమురుగన్. గోవాలో డ్రగ్స్ కింగ్ ఎడ్విన్ కూడా హోటళ్లు నిర్వహిస్తుండటంతో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి గంజాయి, హ్యాష్ ఆయిల్ తీసుకొచ్చి ఎడ్విన్ అందజేసేవాడు. ప్రతిఫలంగా అతడి నుంచి కొకైన్, హెరాయిన్, ఎల్ఎస్ఓ బ్లాట్స్ వంటి సింథటిక్ డ్రగ్స్ తీసుకునేవాడు. ఇద్దరి నెట్వర్క్ను దేశవ్యాప్తంగా విస్తరించారు. పరస్పరం సాయం చేసుకుంటూ డ్రగ్స్ సరఫరాలో కీలకంగా మారారు.
బాలమురుగన్ జాబితాలో సుమారు 2 వేల మంది వరకు కొనుగోలుదారులున్నట్టు సమాచారం. వీరిలో పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులున్నట్టు తెలుస్తోంది. 2015లో గంజాయి విక్రయిస్తుండగా రాజస్థాన్ పోలీసులు బాలమురుగన్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు గోవా చేరుకొని గరంమసాలా హోటల్ ప్రారంభించాడు. ఎడ్విన్ అండదండలతో డ్రగ్స్ కింగ్ పిన్గా ఎదిగాడు. గోవా నుంచే 5 రాష్ట్రాలకు డ్రగ్స్ చేరవేస్తూ చక్రం తిప్పాడు.
బాలమురుగన్ నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. సోమవారం న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. కొన్ని రోజులుగా గోవాలో మకాం వేసిన హైదరాబాద్ పోలీసులు.. కీలక సూత్రదారుల గుట్టురట్టు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..