Telangana Government: ‘జోగుళాంబ’ మా హక్కు.. ఎవరు అడ్డం వస్తారో మేమూ చూస్తాం.. సంచలన కామెంట్స్ చేసిన మంత్రి..

Telangana Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందంటూ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా..

Telangana Government: ‘జోగుళాంబ’ మా హక్కు.. ఎవరు అడ్డం వస్తారో మేమూ చూస్తాం.. సంచలన కామెంట్స్ చేసిన మంత్రి..
Follow us

|

Updated on: Jun 26, 2021 | 3:43 PM

Telangana Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందంటూ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరోసారి తీవ్రంగా స్పందించారు. ఇందులో భాగంగానే శనివారం నాడు మంత్రుల నివాస సముదాయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంపై ఫైర్ అయ్యారు. మంచినీళ్లతో మొదలుపెట్టి.. అన్ని అంశాల్లో తెలంగాణను నిండాముంచారని ఫైర్ అయ్యారు. జోగుళాంబ బ్యారేజీ నిర్మించుకునేందుకు తెలంగాణకు అన్ని విధాలా హక్కు ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి ఉద్ఘాటించారు. బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన లెక్క ప్రకారం జూరాల జెక్టుకు కేటాయించిన మొత్తంలో నీటిని వాడుకోలేకపోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ బ్యారేజీ ద్వారా దానిని వాడుకునేందుకు తెలంగాణకు సంపూర్ణహక్కులు ఉన్నాయన్నారు.

ఇంకా మంత్రి నిరంజన్ రెడ్డి ఏమన్నారో యధావిధిగా ఆయన మాటల్లోనే.. ‘‘మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణల అనుమతితో తలా 5 టీఎంసీలు కేటాయించి మద్రాసుకు నీటిని తరలించడానికి తెలుగుగంగ ప్రాజెక్టును మొదలుపెట్టారు. మానవీయ కోణాన్ని ముందుపెట్టి తాగునీటి పేరుతో సాగునీటి దోపిడీ మొదలుపెట్టారు. కేవలం విద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించినది శ్రీశైలం ప్రాజెక్టు. దాని నుండి పోతిరెడ్డిపాడు కాలువ ద్వారా గండిపెట్టి 11 వేల క్యూసెక్కులు తరలిస్తూ ఆ తర్వాత దానిని 44 వేల క్యూసెక్కులకు పెంచుకున్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఉన్న వనరులను పరస్పర సహకారంతో ఉపయోగించుకుందామని తెలంగాణ స్నేహ హస్తం అందించడం జరిగింది. మొదలు సానుకూలత వ్యక్తం చేసిన ఆంధ్రా ప్రభుత్వం ఆ తరువాత ఎప్పటిలా ఏకపక్షంగా ప్రాజెక్టులు నిర్మిస్తూ మొండిగా ముందుకువెళ్తుంది.’’

‘‘కృష్ణానదిపై రాయలసీమ ఎత్తిపోతల పథకం ముమ్మాటికీ అక్రమమే. ఈ అక్రమ నిర్మాణం మీద చర్యలు తీసుకోవాల్సిన కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం గర్హనీయం. రాష్ట్రాలకు దారిచూపాల్సిన భాధ్యత కేంద్రానికి ఉంటుంది. తెలంగాణ విలీనంతో ఆంధ్రప్రదేశ్ అవతరణ ప్రాతిపదికనే ఒక కుట్ర. ఆ కుట్రలో ప్రధాన అంశం సాగు నీటి వనరుల దోపిడీ. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దక్కన్ పీఠభూమి తెలంగాణలో గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ఉంది. క్రమంగా అది నాశనం అవుతూ వస్తుందని బచావత్ ట్రిబ్యునల్ స్వయంగా తన నివేదికలో పేర్కొంది.’’

‘‘హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు బూర్గుల ప్రభుత్వం అప్పర్ కృష్ణా, తుంగభద్ర లో-లెవెల్ కెనాల్, భీమా ఇరిగేషన్ ప్రాజెక్టులను 180 టీఎంసీల నీరు వాడుకునేలా తలపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుతో ఆ ప్రాజెక్టులన్నీ వెనక్కు పోయాయని బచావత్ ట్రిబ్యునల్ వెల్లడించింది. కృష్ణానది పరివాహక ప్రాంతం మహారాష్ట్రలో 26 వేల స్క్వేర్ మైళ్లు, తెలంగాణలో 20 వేల స్క్వేర్ మైళ్లు ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 9 వేల స్క్వేర్ మైళ్లు మాత్రమే ప్రవహిస్తుంది. ఏదైనా ప్రాజెక్టు తలపెట్టినా దాని నీటి పరివాహక ప్రాంతం, నీటి లభ్యత, ఆ ప్రాంత వెనుకబాటుతనాన్ని ప్రామాణికంగా పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టులు కడతారు. ఆంద్రప్రదేశ్ అవతరణ తర్వాత తెలంగాణ కోసం ఉద్దేశించిన ప్రాజెక్టులు పక్కనపడేసి ఆంధ్రా ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నారు.’’

‘‘తెలంగాణకు జరిగిన నష్టం గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కనీసం బచావత్ ట్రిబ్యునల్ ముందు ప్రస్తావించకపోవడంతో స్వయంగా బచావత్ ట్రిబ్యునల్ పాలమూరు జిల్లాకు సాగునీటి వసతి కల్పించేందుకు 17.84 టీఎంసీల నీటిని జూరాల ప్రాజెక్టుకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణతో తెలంగాణకు నష్టం జరిగిందని, జూరాల ప్రాజెక్టు ద్వారా 17.84 టీఎంసీల నీటిని వినియోగం చేసుకునే అవకాశం లేనట్లయితే దానిని పాలమూరు జిల్లాలోనే మరొక చోట వినియోగించుకోవచ్చని బచావత్ ట్రిబ్యునల్ స్ఫష్టంగా చెప్పింది. ఇది రెండు రాష్ట్రాల నీటి వాటాలకు సంబంధం లేదని, అలా చూడవద్దని కూడా తేల్చి చెప్పింది.’’

‘‘జూరాల నిర్మాణం 11 టీఎంసీల సామర్థ్యం.. రిజర్వాయర్ లెవెల్ 9.5 టీఎంసీలకు గాను 6.5 టీఎంసీలనే వాడుకోగలుగుతున్నాం. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జోగుళాంబ బ్యారేజీని ఎంతో ముందుచూపుతో ప్రకటించారు. ఆంద్రా అక్రమ ప్రాజెక్టులకు, తెలంగాణ సక్రమ ప్రాజెక్టులకు పొంతనలేదు. దబాయింపు మాటలు ఇప్పుడు చెల్లుబాటు కావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయాయని, తెలంగాణ వాటాలపై మీ దాదాగిరి చెల్లదని ఆంధ్రా ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఇది సర్వహక్కుల తెలంగాణ రాష్ట్రం అని ఆంధ్రా ప్రభుత్వం గుర్తించాలి. కృష్ణానదిపై నీటివాటాలో హక్కులు కలిగి ఉన్నది ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలే. ఆంధ్రా ప్రభుత్వం తమ రాష్ట్రానికి నీటి కేటాయింపులు జరిపించుకుని కేంద్రం అనుమతులు తీసుకోవాలి.’’

‘‘బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ను కృష్ణానదిలో నీటివాటాలు తేల్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో స్వయంగా ఉమాభారతిని కలిసి కోరారు. ప్రధాన మంత్రిని, ప్రస్తుత కేంద్ర జల్ శక్తి మంత్రిని అనేకమార్లు తెలంగాణ ప్రభుత్వం నీటివాటాలు తేల్చాలని కోరడం జరిగింది. కానీ వారి నుండి ఎలాంటి స్పందన లేదు. ప్రాజెక్టులు పూర్తయితే దాని కింద వచ్చే ఉత్పత్తి, ఉపాధి ఈ దేశ సంపదను, సామరస్యాన్ని పెంచుతాయి. అశాంతిని, ఆకలిని దూరం చేస్తాయి. రాష్ట్రాలు కొట్లాడుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ వైఖరా అన్న అనుమానం కలుగుతుంది. ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం చేయూతనివ్వకపోగా రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించడం లేదు. కేంద్రం సూచన మేరకు సమస్యను ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్తామంటేనే తెలంగాణ ప్రభుత్వం కోర్టు నుండి ఫిర్యాదును వెనక్కు తీసుకుంది.’’

‘‘కేంద్రం మాట విని వ్యవస్థ మీద గౌరవంతో ఫిర్యాదును వెనక్కు తీసుకున్నది తెలంగాణ ప్రభుత్వం చేతగానితనమా? కేంద్రాన్ని, రాష్ట్రాల మధ్య సంబంధాలను, బేసిన్ పరిధిలోని నియమాలను పట్టించుకోకుండా అక్రమ ప్రాజెక్టులు కట్టడం చక్కదనమా? అసలు కేంద్రం వైఖరి ఏంటి? వాటర్ బోర్డు మేనేజ్‌మెంట్ ఏం చేస్తుంది? ఆరోపణలు, వార్తలు ముందుకు వచ్చినప్పుడు కృష్ణాబోర్డు సుమోటోగా ఎందుకు ముందుకు వెళ్లడం లేదు? గ్రీన్ ట్రిబ్యునల్‌ కు స్వయంగా ఆంధ్రా ప్రభుత్వం.. కేంద్రం నుండి అన్ని అనుమతులు తీసుకున్నాకే నిర్మాణం మొదలుపెడతామని అండర్ టేకింగ్ ఇచ్చింది. వారు చెప్పిన దానిని వారే తుంగలో తొక్కి యధావిధిగా పనులు చేస్తున్నారు.’’

‘‘ఆనాటి నుండి ఈనాటి వరకు తెలంగాణకు జలవనరులలో అన్యాయం జరగడానికి ప్రధాన కారణాలు రెండే రెండు. అప్పటి ఆంధ్రా ప్రాంత పాలకుల దుర్బుద్ధి, తెలంగాణ ప్రాంతంలో ఉన్న బానిస మనస్తత్వం కలిగిన ఇంటి దొంగల వైఖరి. మద్రాసు నగరానికి మంచినీళ్ల పేరుతో తెలుగు గంగను మొదలుపెట్టారు. పనుల ప్రారంభానికి రూ.50 కోట్ల చెక్కు ఇంధిరాగాంధీ తన చేతుల మీదుగా స్వయంగా ఇచ్చిందన్న విషయం కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాలి. తెలుగు గంగ కాలువ వెళ్తుంటే దారిలో దుర్భిక్ష ప్రాంతాల పేరుతో కర్నూలు, కడప, నెల్లూరులకు 2 లక్షల ఎకరాలకు నీళ్లు పారించుకున్నారు. అక్రమ ప్రాజెక్టులు, జల అంశాల మీదనే కాంగ్రెస్‌తో విభేధించి టీఆర్ఎస్ పార్టీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుండి బయటకు వచ్చింది.’’

‘‘టీఆర్ఎస్ పార్టీనీ, కేసీఆర్‌ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఇప్పుడు విమర్శిస్తున్న నేతలంతా అప్పట్లో జలదోపిడీకి కావడిమోసిన వాళ్లే. ఒక మాజీ మంత్రి హారతులు పడితే, ఇంకో మాజీ మంత్రి పోతిరెడ్డిపాడుకు అనుకూలంగా వ్యాసాలు రాశాడు. ఇంకో మాజీ మంత్రి రాజశేఖర్ రెడ్డి లాంటి వాడు మా ప్రాంతంలో పుట్టలేదే అన్నాడు. వీరి పొగడ్తల వేశాలు తెలంగాణ ప్రజలు చూసిందే. తెలంగాణ ఉద్యమమే నీటి కోసం. మా ప్రాంత హక్కు అయిన కృష్ణా జలాలపై హక్కును ఎలాంటి పరిస్థితులలో వదులుకోబోము.’’

‘‘జోగుళాంబ బ్యారేజీ నిర్మాణానికి మాకు అన్ని హక్కులు ఉన్నాయి. అన్ని అనుమతులు ఉన్న మేము అణుకువగా ఉంటే.. ఏ హక్కూ లేని వారు ఎగిరెగిరి పడుతున్నారు. జోగుళాంబ ప్రాజెక్టు నిర్మాణానికి ఎవరడ్డమొస్తారో మేమూ చూస్తాం. అక్రమమైన ప్రాజెక్టు ఆంధ్రాలో నిర్మాణమవుతుంటే అక్కడ ఏ పార్టీ వారు, ఇతరులు ఎవరూ కేసులు వేయలేదు. ఆకలితో అల్లాడిన తెలంగాణలో సక్రమంగా ప్రాజెక్టులు కడుతుంటే మన సన్నాసులే 100 మంది కేసులు వేశారు. తెలంగాణ సమాజం దీనిని గమనించాలి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేసే వారిని పట్టించుకోవద్దు.’’ అంటూ తెలంగాణ హక్కులను ఉద్ఘాటించి చెప్పిన మంత్రి నిరంజన్ రెడ్డి.. ఇదే సమయంలో తీవ్ర స్వరంతో అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరును, ఇటు తెలంగాణ విపక్ష నేతల వైఖరిని తూర్పారబట్టారు.

కాగా, మంత్రి నిరంజన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, అబ్రహం, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కాటేపల్లి జనార్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Also read:

Telangana Congress: రాజకీయ దుమారం రేపుతున్న సీఎం కేసీఆర్‌తో సీఎల్పీ నేతల భేటీ.. భట్టి బృందంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్..?