KTR on Rahul: ధమ్ బిర్యానీ తిని, డైలాగ్‌లు కొట్టిపోతారు.. రాహుల్‌ గాంధీపై కేటీఆర్‌ సెటైర్లు!

రాహుల్‌ - కేటీఆర్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి కేటీఆర్‌ రైతులను గాలికొదిలేశారు, కాంగ్రెస్‌ ఉంది భయపడొద్దని రాహుల్‌ అంటే...టూరిస్ట్‌లు వస్తుంటారు.. పోతుంటారు.. ఏదో వచ్చారు కాబట్టి మాట్లాడి పోతుంటారని కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు.

KTR on Rahul: ధమ్ బిర్యానీ తిని, డైలాగ్‌లు కొట్టిపోతారు.. రాహుల్‌ గాంధీపై కేటీఆర్‌ సెటైర్లు!
Ktr
Follow us

|

Updated on: May 07, 2022 | 1:50 PM

Minster KTR on Rahul Gandhi: రాహుల్‌ – కేటీఆర్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి కేటీఆర్‌ రైతులను గాలికొదిలేశారు, కాంగ్రెస్‌ ఉంది భయపడొద్దని రాహుల్‌ అంటే…టూరిస్ట్‌లు వస్తుంటారు.. పోతుంటారు.. ఏదో వచ్చారు కాబట్టి మాట్లాడి పోతుంటారని కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. నిన్న ఒకాయన వరంగల్‌కు వచ్చిపోయాడు, ఆయనకు వడ్లు తెలియదు. ఎడ్లు తెలియదు. కాంగ్రెస్‌ వాళ్లు రాసిచ్చింది చదివిపోయాడు. డైలాగ్‌లు కొడతారు.. పోతారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. చాలామంది వస్తారు హైదరాబాద్ లో ధమ్ బిర్యానీ తిని పోతారు.. అలాంటి వాళ్లను పట్టుంచుకోవాల్సిన అవసరం లేదని మంత్రి వ్యంగ్యా్స్త్రాలు సంధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీ రామారావు పర్యటించారు. ఈ నేపథ్యంలోనే గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్‌టైల్‌ పార్కులో ఏర్పాటు చేస్తున్న కిటెక్స్ టెక్స్‌టైల్‌ పరిశ్రమకు భూమిపూజ చేసిన సంద‌ర్భంగా కేటీఆర్ ప్ర‌సంగించారు.

దేశంలోనే అత్యుత్తమ పత్తి తెలంగాణలో సాగు జరుగుతుందని రాహుల్ గాంధీకి కనిపించడంలేదా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అజాంజాహి మిల్లును మూసేస్తే పొట్టచేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికులు, కేసీఆర్ వల్ల మళ్లి తిరిగి వస్తున్నారన్నారు. వరంగల్‌కు మరో 20 కంపెనీలు రాబోతున్నాయని మంత్రి తెలిపారు. భారతదేశంలో ఎక్కడా ఇంతపెద్ద టెక్స్‌టైల్ పార్క్ లేదు.. మోడీకి ఇలాంటి టెక్స్‌టైల్ పార్క్ నిర్మించాలనే సోయి లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్-బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో గ్రామాల్లో చర్చపెట్టాల్సిన అవసరముందని మంత్రి అభిప్రాయపడ్డారు. నిత్యవసర వస్తువుల ధరలు గురించి మాట్లాడితే వివాదాలు సృష్టించి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో పారిశ్రామికీక‌ర‌ణ వేగంగా జ‌రుగుతుందని మంత్రి తెలిపారు. టెక్స్‌టైల్స్ ప‌రిశ్రమ‌తో ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలోని వేలాది మందికి ఉపాధి అవ‌కాశాలు రాబోతున్నాయ‌ని మంత్రి తెలిపారు. రైతులు క‌ష్టమైనా, న‌ష్టమైనా ఓర్చుకొని ఇబ్బందైనా త‌ట్టుకొని భూములు ఇచ్చిన వారంద‌రికీ పేరుపేరునా పాదాభివంద‌నాలు చేస్తున్నాను. ఎందుకంటే చిన్న త్యాగం కాదు. ప్రాజెక్టుల‌కు భూములు ఇచ్చే రైతుల త్యాగాలు వెల‌క‌ట్టలేనివి. వాళ్లకు మ‌నం ఎంత చేసినా త‌క్కువ‌నే. రుణం తీర‌దు. కొంత మంది న‌ష్టపోతే చాలా మందికి లాభం జ‌రుగుతుద‌ని ఆలోచ‌న చేసి, పెద్ద మ‌న‌సుతో భూములు ఇస్తున్నారు. భూములు ఇచ్చిన రైతులంద‌రికీ 100 గ‌జాల చొప్పున ప్లాట్లు ఇవ్వాల‌ని ఆదేశించాం. క‌చ్చితంగా ఇస్తామ‌ని మాటిస్తున్నాన‌ని కేటీఆర్ స్పష్టం చేశారు.

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సంస్థ పిల్ల‌ల దుస్తులు త‌యారు చేసే సంస్థ కిటెక్స్ అని చెప్పారు. ఈ ప‌రిశ్రమ నుంచి ఉత్ప‌త్తి చేసిన బ‌ట్ట‌ల‌ను దేశ‌విదేశాల‌కు ఎగుమ‌తి చేస్తున్నారు. కిటెక్స్ సంస్థ రూ. 3 వేల కోట్లు పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఆలోచ‌న చేసిన‌ప్పుడు వారిని తెలంగాణ‌కు ఆక‌ర్షించ‌డానికి ఎంతో ప్ర‌య‌త్నం చేసి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. రూ. 1600 కోట్ల పెట్టుబ‌డులు పెట్ట‌బోతోంది. 15 వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. కొరియాకు చెందిన యంగ్ వ‌న్ అనే కంపెనీ రూ. 1100 కోట్ల‌తో పెట్టుబ‌డులు పెట్ట‌బోతున్నారు. 12 వేల మందికి ఉద్యోగాలు క‌ల్పించ‌నున్నారు. ఈ రెండు కంపెనీలు కూడా 8 నుంచి 11 ఫ్యాక్ట‌రీలు పెట్ట‌బోతున్నారు. రాబోయే 18 నెల‌ల్లో ప‌నుల‌న్నీ పూర్త‌వుతాయి. భార‌త‌దేశంలో ఇలాంటి టెక్స్ టైల్స్ పార్కు ఎక్క‌డా లేద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.