High Court: సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్కు హైకోర్టు షాక్.. ప్రభుత్వానికి రూ.15లక్షలు తిరిగి ఇవ్వాలని ఆదేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్కు రాష్ట్ర హైకోర్టు గట్టి షాకిచ్చింది. పరువు నష్టం దావా వేసేందుకు ఆమె రాష్ట్ర ప్రభుత్వం నిధులు వినియోగించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
High Court on Smita Sabharwal: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్కు రాష్ట్ర హైకోర్టు గట్టి షాకిచ్చింది. పరువు నష్టం దావా వేసేందుకు ఆమె రాష్ట్ర ప్రభుత్వం నిధులు వినియోగించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. తన ఫోటోను అవమానకరంగా ప్రచురించారంటూ 2015లో ఔట్ లుక్ మ్యాగజీన్పై స్మితా సబర్వాల్ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు ఫీజులు చెల్లించేందుకు ఆమెకు తెలంగాణ ప్రభుత్వం రూ.15లక్షలు మంజూరు చేసింది. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై ఔట్ లుక్తో పాటు మరో ఇద్దరు.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ చర్య నిబంధనలకు విరుద్ధంగా ఉందని, ఐఏఎస్ అధికారి వ్యక్తిగతంగా వేసిన వ్యాజ్యానికి ప్రభుత్వం ఎలా ఫీజులు చెల్లిస్తుందని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.
దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పబట్టింది. స్మితా సబర్వాల్కు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చడంపై విస్మయం వ్యక్తం చేసింది. ప్రైవేట్ వ్యక్తి ప్రైవేటు సంస్థపై కేసు వేస్తే అది ప్రజా ప్రయోజన వ్యాఖ్యం కాదని పేర్కొన్న హైకోర్టు.. రూ.15లక్షల మొత్తాన్ని 90 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని స్మితా సబర్వాల్ను ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయం అసమంజసంగా ఉందని ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు సహేతుకంగా లేకుంటే కోర్టులు సమీక్షించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.