Telangana: విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్.. వారందరికి ఉచితంగా ల్యాప్టాప్స్, ఏఐ శిక్షణ..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. అమెజాన్ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో AI, కంప్యూటేషనల్ థింకింగ్ కోర్సులు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఇందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా 28,000 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చింది. అలాగే విద్యార్థులకు ఉచితంగా 2,000 ల్యాప్టాప్ల ఇచ్చేందుకు సిద్ధమైంది.

తెలంగాణ విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సాంకేతిక ప్రపంచంలో దూసుకుపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఇకపై ప్రభుత్వ స్కూళ్ల క్లాస్రూమ్లలోకి తీసుకువస్తోంది. గ్లోబల్ టెక్ దిగ్గజం అమెజాన్ భాగస్వామ్యంతో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఒక వినూత్న ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ద్వారా 6వ తరగతి నుంచి 9వ తరగతి చదువుతున్న సుమారు 10 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతి ఏటా ఉచితంగా ఏఐ అక్షరాస్యత, కంప్యూటేషనల్ థింకింగ్ కోర్సులను బోధించనున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా, ప్రభుత్వ విద్యార్థులను భవిష్యత్తు సాంకేతికతకు సిద్ధం చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(SCERT) ప్రత్యేకంగా ఒక ఏఐ పాఠ్యప్రణాళికను రూపొందించింది. నాన్ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పి జామ్ ఫౌండేషన్ సహకారంతో కోడ్మిత్ర అనే ఎడ్టెక్ ప్లాట్ఫారమ్ ద్వారా విద్యార్థులకు ఈ డిజిటల్ పాఠాలు అందుబాటులో ఉంటాయి. ప్రతి విద్యార్థికి ఏడాదికి 25 గంటల పాటు ప్రత్యేక ఏఐ శిక్షణ లభిస్తుంది. ఇందులో భాగంగా సమస్యలను సులభంగా పరిష్కరించడం, డేటా ప్యాటర్న్స్ గుర్తించడం, నిజజీవితంలో ఏఐ అప్లికేషన్ల వాడకం వంటి అంశాలపై ప్రాక్టికల్ అవగాహన కల్పిస్తారు. ఈ డిజిటల్ విద్యా విప్లవాన్ని విజయవంతం చేయడానికి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 28,000 మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు విద్యాశాఖ ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.
కేవలం పాఠాలకే పరిమితం కాకుండా, ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు అమెజాన్ సంస్థ భారీగా డిజిటల్ పరికరాలను సమకూరుస్తోంది. రాష్ట్రంలోని 93 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు 152 అర్బన్ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు కలిపి దాదాపు 2,000కు పైగా ల్యాప్టాప్లను ఉచితంగా అందజేస్తున్నారు. దీనివల్ల కంప్యూటర్లు అందుబాటులో లేని పేద విద్యార్థులకు కూడా సాంకేతికతపై పట్టు సాధించే అవకాశం లభిస్తుంది. దేశంలోనే ఇంత భారీ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల సిలబస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను చేర్చిన తొలి రాష్ట్రాలలో ఒకటిగా తెలంగాణ నిలిచింది. డిజిటల్ విభజనను తగ్గించి, ప్రభుత్వ స్కూల్ పిల్లలను గ్లోబల్ లీడర్లుగా మార్చే ఈ ప్రయత్నంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




