
తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సిద్దమైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఇవాళ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. అభివృద్ది, సంక్షేమంపై మంత్రులు సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలు, విధివిధానాలపై చర్చించనున్నారు. ఇప్పటికే విధివిధానాలు దాదాపుగా ఖరారు అయ్యాయి. పథకం ఎవరికి వర్తింపచేయాలి..? అర్హతలు ఏంటి? ఎలా అమలు చేయాలి? అనేదానిపై గైడ్ లైన్స్ రూపొందించారు.
-రేషన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి
-వయస్సు 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి
-కుటుంబంలో కోరినవారి పేరు మీద పాలసీ
-కుటుంబసభ్యుల అభిష్టం మేరకు యజమాని లేదా కుటుంబసభ్యుల పేర్లపై పాలసీ తీసుకోవచ్చు
-నామినీకి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి
జూన్ నుంచి అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించనున్నారు. అర్హులైనవారి వివరాలను నమోదు చేయనున్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారిని గుర్తించి సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేలో కుటుంబసభ్యుల వివరాలు సేకరించి డిజిటల్ డేటా బేస్ సిద్దం చేయనున్నారు. పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పాలన అధికారులు, మున్సిపల్ వార్డు అధికారులకు సర్వే బాధ్యతలు అప్పగించారు. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా వివరాలను సేకరించనున్నారు. జూన్ 2వ తేదీన పథకం విధివిధానాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి రాజకీయ జోక్యానికి సంబంధం లేకుండా పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు.
ఈ పథకం కింద పాలసీదారుడు మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తారు. కుటుంబ సభ్యులు క్లెయిమ్ చేసుకున్న పది రోజుల్లోనే నామినీ అకౌంట్లో నేరుగా జమ అవుతాయి. ఇందుకోసం బ్యాంకింగ్ చానెళ్లను అనుసంధానించనున్నారు. బీమా క్లెయిమ్ చేసుకునేందుకు కుటుంబసభ్యులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా క్లెయిమ్ చేసుకున్న వెంటనే క్లియరెన్స్ ఇచ్చేలా సింగిల్ విండో విధానం పాటించనున్నారు. అయితే బడ్జెట్లో ఈ పథకానికి ఇప్పటికే రూ.4 వేల కోట్ల కోటాయింపు జరిగింది. 1.15 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డు ఉండగా.. వీరి తరపున రూ.3,509 వార్షిక ప్రీమియంను ప్రభుత్వం ఒకేసారి ఇన్యూరెన్స్ కంపెనీలకు చెల్లించనుంది. ఒక్కొ కుటుంబానికి రూ.3,509 చొప్పున ప్రీమియం అవుతుందని తెలుస్తోంది.